చెత్తబుట్టలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో | TDP election manifesto in dustbin | Sakshi
Sakshi News home page

చెత్తబుట్టలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో

May 8 2015 3:47 AM | Updated on Oct 30 2018 4:15 PM

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సింగపూర్, జపాన్ పర్యటనలను కొనసాగిస్తున్నారని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి విమర్శించారు.

నంద్యాల : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సింగపూర్, జపాన్ పర్యటనలను కొనసాగిస్తున్నారని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి విమర్శించారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే సహచర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ కార్మికులను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని భూమా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో రెండు దఫాలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని బాబు ఆలోచించిన విషయాన్ని భూమా వారికి గుర్తు చేశారు.

రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జేఏసీనేత ఖాన్ మాట్లాడుతూ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇప్పటికే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భూమా అండగా నిలువాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement