విద్యార్థినిని బలిగొన్న బస్సు | student killed in accident near Champapet | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని బలిగొన్న బస్సు

Oct 6 2013 3:27 AM | Updated on Jul 26 2019 4:10 PM

అతివేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాప్‌లో నిలబడి ఉన్న విద్యార్థినిపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

చంపాపేట, న్యూస్‌లైన్: అతివేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాప్‌లో నిలబడి ఉన్న విద్యార్థినిపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షాపురం అరుంధతినగర్ కాలనీలో నివసిస్తున్న నల్లా కరుణాకర్, సుధారాణి దంపతులకు ముగ్గురు సంతానం.
 
 కరుణాకర్ డీఆర్‌డీఎల్‌లో ప్రైవేటు ఉద్యోగి. చిన్న కూతురు కీర్తన ఐఎస్ సదన్ చౌరస్తాలోని సంగం లక్ష్మీబాయి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగా శనివారం కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కీర్తన సంతోష్‌నగర్ వైస్రాయి హోటల్ సమీపంలోని బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చేస్తోంది. అదే సమయంలో కేశవగిరి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న మిథాని డిపో బస్సు (ఏపీ 11జడ్ 2681) అతివేగంగా దూసుకొచ్చి ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో కీర్తన అక్కడికక్కడే మృతి చెందింది.  డ్రైవర్ బస్సు దిగి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బస్సును స్వాధీనం చేసుకొని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement