
బ్రమరాంబ ,రామస్వామి
శ్రీకాళహస్తి రూరల్: ముక్కుసూటి అధి కారిగా పేరు తెచ్చుకున్న శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిణి భ్రమరాంబ మంగళవారం బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో తొలిసారి ఐఏఎస్ అధి కారి బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామస్వామిని ఇక్కడకు కార్యనిర్వహణాధికారిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతానికి బ్రమరాంబకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఎండోమెంట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తశుద్ధితో ముందడుగు
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే భ్రమరాంబను బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం మాస్టర్ ప్లాన్ అమలు పూర్తికాకమునుపే ఈమెకు స్థాన చలనం కల్పించడం చర్చనీయాంశమైంది. 2015 అక్టోబర్ 8న ఆమె ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ మూడుసార్లు శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిం చారు. మూడుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిం చిన ఘనత ఈమెకే దక్కింది. రూ. 2కోట్ల వ్యయంతో భరద్వాజ తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఆమె బాధ్యతలు స్వీకరించాక గోశాలను గాడిలో పెట్టారు. అంతకుముందు దీని పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. నర్సరీ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. ఆలయ ఆవరణలో దళారీ వ్యవస్థను నిర్మూలించటంలో చాలామటుకు సఫలీకృమయ్యారు. ఆలయంపై స్థానిక అధికార పార్టీ నాయకుల పెత్తనాన్ని నియంత్రించగలిగారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా నివాసం కోల్పోతున్న యజమానులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై కొంత మేర సక్సెస్ అయ్యారు. కొంతమంది యజమానులకు నష్టపరిహారం అందించి స్వాధీనం చేసుకుని ఇళ్లను తొలగించారు. ఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈమె నిబద్ధతగా వ్యవహరించేవారని ఆలయ ఉద్యోగులు చెబుతారు.
వివాదాలు చోటుచేసుకున్నా నిర్ణయం అమలులో తనదైన పంధాలో ముందుకు వెళ్లారు. పాలకమండలి, అర్చకులు, వేద పండితులు తిరుగుబాపుటా ఎగురవేసినా పట్టించుకోలేదు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి తనిఖీల పేరుతో ఆలయానికి వచ్చి హడావుడి చేసేవారు. ఎమ్మెల్యే కుమారుడు ఆలయంలో ఆధిపత్యం కొనసాగాలనే విధంగా ఉండేవారు. వీరిద్దరి జోక్యం ఆలయంపై పడనీయకుండా అడ్డుపడగలిగేవారు. ఈమె నిర్ణయాలు అధికారపార్టీ నాయకులకు మింగుడుపడేవి కావు. రెండేళ్ల నుంచి ఈమెను బదిలీ చేయాలని అధికార పక్షం నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిసింది. అవినీతి ఆరోపణ లేకపోయినా బదిలీ చేయడం..వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆలయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నా యి. నిజాయితీ అధికారుల పట్ల టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఇది దర్పణం పడుతోందని ఆ వర్గాలు నిరసిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే విధులు నిర్వహించాలని భ్రమరాంబ భావిస్తున్నట్లు సమాచారం.
తొలిసారి ఐఎఎస్ సారథ్యం..
ముక్కంటి ఆలయానికి గణనీయంగా వార్షిక ఆ దాయం పెరగటంతో 15 సంవత్సరాల నుంచి ఐ ఏఎస్ అధికారిని ఈఓగా నియమించాలనే ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఆర్డీఓ, ఆర్జేసీ హో దా కలిగిన వారిని మాత్రమే నియమిస్తూ వచ్చా రు. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారికి పరిపాలనా బా ధ్యతలను అప్పగించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా సుమారు 290 భవనాలను స్వాధీనం చేసుకుని రూ.300 కోట్లతో ఆలయాన్ని విస్తరించేందుకు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వవర్గాలు సమర్ధించుకుంటున్నాయి.
కొత్త ఈఓ రామస్వామి
ఆలయ ఈఓగా నియమితులైన ఎస్.రామస్వామి ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన వారు. కర్నూలు జిల్లాలో సుదీర్ఘకాలం పాటు డీఆర్వోగా, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్గా, జేసీ–2గా సమర్థంగా విధులు నిర్వర్తించారు. రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన రామస్వామి అనేక ఘటనలపై విచారణాధికారిగా నియమితులై.. నిష్పక్షపాతంగా పనిచేశారు. ఈయన నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నా యి.