విశాఖ ఏజెన్సీలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పాడేరులో ప్రత్యేకంగా గిరిజన క్రీడ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) ఎమ్డీ మహ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు.
- విలువిద్య, షూటింగ్లకు ప్రోత్సాహం
- అంతర్జాతీయ పోటీలకు ప్రత్యేక శిక్షణ
- శాప్ ఎమ్డీ మహ్మద్ అబ్దుల్ అజీమ్
పాడేరు: విశాఖ ఏజెన్సీలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పాడేరులో ప్రత్యేకంగా గిరిజన క్రీడ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) ఎమ్డీ మహ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. శనివారం పాడేరు,అరకులోయ ప్రాంతాలలో పర్యటించి గిరిజన క్రీడా రంగం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఉదయాన్నే పాడేరు సీఎహెచ్ పాఠశాల మైదానంలో గిరిజన విద్యార్థులు విలువిద్య క్రీడా కార్యక్రమాలను పరిశీలించారు. విలువిద్యలో ప్రతిభ కనబరుస్తున్న బైరాగినాయుడు,ఇతర క్రీడాకారులను ఎమ్డీ అభినందించారు. వారితో పాటు ఎమ్డీ అజీమ్ విల్లును ఎక్కుపెట్టారు. అనంతరం ఐటీడీఏ ఇండోర్ స్టేడియంను పరిశీలించారు.
ఆ సమయంలో షటిల్ ఆడుతున్న పలువురు స్టేడియంను అభివృద్ధి చేయాలని ఎమ్డీని కోరారు. ఐటీడీఏ పీవోతో చర్చించి,అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొద్దిసేపు ఎమ్డీ ఉత్సాహంగా షటిల్ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాడేరులో క్రీడా అకాడమీ ఏర్పాటు చేసి గిరిజన యువతీ యువకులకు క్రీడా నైపుణ్యం బట్టి శిక్షణ ఇస్తామన్నారు. తొలుత విలువిద్య, షూటింగ్ కార్యక్రమాలను చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా తీర్చిదిద్దుతామన్నారు. ఐదేళ్లు, పదేళ్లు తదితర లక్ష్యాలతో ఈ కార్యక్రమాలుంటాయన్నారు.
అంతర్జాతీయస్థాయి పోటీలు, కామన్వెల్త్, ఇతర జాతీయ పోటీల్లో పాల్గొనే సత్తా గిరిజన విద్యార్థులకు ఉందన్నారు. ప్రస్తుతం విలువిద్య క్రీడాకారులకు మరింత శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ పోటీలకు పంపుతామన్నారు. ప్రత్యేక శిక్షకులు, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలన్నీ స్పోర్ట్ అకాడమీలో కల్పిస్తామన్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు కూడా అండర్-17 విభాగాల్లో విలువిద్య షూటింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్తో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
విలువిద్య శిక్షణకు సంబంధించిన ఖరీదైన పరికరాలను కూడా అందుబాటులో తెస్తామన్నారు. విదేశాల నుంచి కూడా వీటిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విలువిద్య, షూటింగ్ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువకులను క్షేత్రస్థాయిలో గుర్తించి శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. క్రీడారంగానికి ప్రభుత్వం ఇచ్చే నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేకన్నా గిరిజన విద్యార్థులు ఆసక్తి చూపే క్రీడల అభివృద్ధి కోసం ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అలాగే ఏజెన్సీలోని చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో రూ.2.10 లక్షల అంచనాతో ఔట్డోర్ స్టేడియాలు కూడా నిర్మిస్తామన్నారు. వీటిల్లో అన్ని రకాల క్రీడలకు సౌకర్యాలు క ల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీ ప్రతినిధి ఎల్.దేవానందం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి సూర్యారావు, క్రీడాఅభివృద్ధి విభాగం డీఈఈ ప్రసంగరాజు, సీఏహెచ్ స్కూల్ హెచ్ఎం జివివి ప్రసాద్, వార్డెన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు.