పిడుగుపాటుకు ఏడుగురు మృతి | Seven people killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఏడుగురు మృతి

May 14 2017 6:50 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు

గుమ్మగట్ట(అనంతపురం): అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడింది. చెరువు ప్రాంతంలో గొర్రెలు, మేకలు మేపుకోవడానికి, సిమెంటు పనిమీద వెళ్లిన అయిదుగురు వ్యక్తులు పిడుగుపడిన శబ్దానికి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు.

బోయ శివప్ప(25), బోయ ఊబన్న(40), జనమ జయన్న(50), కంతార్లపల్లి గిరిరెడ్డి(40), కరీంసాబ్‌(34)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా వేరువేరు కుటుంబాలకు చెందిన వారు. వర్షం నుంచి తలదాచుకునేందుకు పొలంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వీరిలో గిరిరెడ్డి, జయన్నలు మరో ముగ్గురితో కలిసి సమాధి పని చేసేందుకు కంకర కోసం చెరువు ప్రాంతానికి వెళ్లారు. కాగా, రాయదుర్గం మండలం కదరంపల్లిలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి.

కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు మృతి
పెద్ద కడబూర్‌: కర్నూలు జిల్లా పెద్ద కడబూర్‌ మండలం చిన్నతుంబలం గ్రామ పొలంలో పిడుగు పడి వృద్ద మహిళ, చిన్నారి మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు అవ్వ, మనుమరాలుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement