రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని నిన్నటివరకు బీరాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని నిన్నటివరకు బీరాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇతరత్రా సమస్యలేమైనా ఉంటే చర్చించేందుకు సిద్ధం కావాలి తప్ప సమైక్యాంధ్ర ఊసెత్త వద్దని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన నిర్ణయం జరిగినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగా మూకుమ్మడిగా రాజీనామాలు చే యడం ద్వారా కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేయకుండా తూతూమంత్రం రాజీ‘డ్రామా’లకే సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు. కొందరైతే అసలు రాజీనామాల యోచనకే దూరంగా ఉన్నారు.
కానీ ఊహించని స్థాయిలో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుండటం ఈ నేతలకు మింగుడు పడటం లేదు. మరోవైపు అధిష్టానం కూడా వీరిని పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని అయోమయంలో పడ్డారు. ఇటు అధిష్టానాన్ని ఎదిరించలేక అటు ప్రజల వద్దకు వెళ్లే సాహసం చేయలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ ముందు హాజరై తమ వాదన విన్పించాలని నిర్ణయం తీసుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.. సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరించడంతో పాటు విభజనతో వాటిల్లే నష్టాలను తెలియజేస్తూ ఒక నోట్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రాజీనామాల సమయంలో, అనేక ఇతర సందర్భాలలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన సమస్యలు, అంశాలనే ఆంటోనీ కమిటీ ముందు ఏకరువుపెట్టి, తమ ‘సమస్యలకు’ పరిష్కారం చూపాల్సిందిగా అభ్యర్థించాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా సాగు, తాగునీరు, కొత్త రాజధాని నిర్మాణం, కేంద్ర సంస్థల ఏర్పాటు, విభజన తరువాత తెలంగాణలో నివసించే సుమారు కోటిమంది సీమాంధ్రుల్లో నెలకొన్న భయాందోళనలు వంటి అంశాలను నోట్లో పొందుపరుస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విభజనవల్ల కృష్ణా, గోదావరి బేసిన్లో ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
‘‘శ్రీశైలంలో నిర్దిష్టస్థాయిలో నీరు నిల్వ లేకుంటే రాయలసీమకు చుక్క నీరు కూడా అందని పరిస్థితి. విభజిస్తే సమస్య తీవ్రస్థాయికి చేరి రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముంది? నీటి యుద్ధాలు వచ్చే అవకాశముంది. హైదరాబాద్ జనాభాలో 30 శాతం, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 20 శాతం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 10 శాతానికిపైగా సీమాంధ్రులు నివసిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో కోటి మందికిపైగా నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలకు విభజన వల్ల భద్రత విషయమై భయం ఏర్పడింది. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత కొందరు ఆస్తులను అమ్ముకుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరిని కొందరు తెలంగాణవాదులు బెదిరిస్తున్నారు. వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఇది రోజురోజుకూ ఎక్కువవుతోంది. మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో రాజధానిని త్యాగం చేసి హైదరాబాద్కు వచ్చాం. నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం.
వందల కి.మీల విస్తీర్ణంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అనేక జాతీయస్థాయి సంస్థలు హైదరాబాద్లోనే ఏర్పాటయ్యాయి. 54 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాజధానిలో ఉన్నాయి. ఇక ప్రైవేటు విద్యా, వైద్య సంస్థలు, ఆసుపత్రులకు కొదవేలేదు. కొత్త రాజధానిలో ఆయా సంస్థలన్నింటినీ ఏర్పాటు చేస్తారా? కనీసం కేంద్ర సంస్థలన్నీ ఏర్పాటు చేస్తారా? మెట్రో రైలును కొత్త రాజధానిలోనూ నిర్మిస్తారా? హైదరాబాద్ మాదిరిగా కొత్త రాజధానికి సరిపడా స్థలం సీమాంధ్రలో ఎక్కడా లేదు. ప్రకాశం జిల్లాలో వాన్పిక్ భూముల్లో రాజధానిని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నా...అక్కడ అంత స్థలం లేనే లేదు. పైగా అక్కడ చుక్క నీరు లేదు. హైదరాబాద్లో సగటున రోజుకు 25 టీఎంసీల నీరు అవసరం అవుతోంది. ప్రకాశం జిల్లాలో ఒక్క టీఎంసీ నీటికి కూడా దిక్కులేదు. అలాంటప్పుడు తాగునీరెలా తీసుకొస్తారు?
మరోసారి మోసపోలేం
రాష్ట్ర ఆదాయంలో సింహభాగం హైదరాబాద్దే. ఈ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు ఎలా షేర్ చేస్తారు? అది సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ వాళ్లు ఒప్పుకుంటారా? కొత్త రాజధాని కోసం ఎంత డబ్బు వెచ్చిస్తారు? కేంద్రం ఇచ్చే సొమ్ముతో కొత్త రాజధానిని మరో హైదరాబాద్లా ఎలా నిర్మిస్తారు? 40 ఏళ్ల క్రితం పంజాబ్, హర్యానా విడిపోయినప్పుడు కేంద్రం ఇచ్చిన హామీలే ఇంతవరకు అమలు కాలేదు. ఎన్డీయే హయాంలో కొత్తగా ఏర్పాైటైన ఛత్తీస్గఢ్లో రాజధాని ఏర్పాటుకు ఇస్తానన్న నిధులే ఇంతవరకు ఇవ్వలేదు.
ఇప్పటికే మద్రాస్ నుంచి విడిపోయి రాజధానిని త్యాగం చేసి హైదరాబాద్ కు వచ్చి మోసపోయాం. ఇక్కడినుంచి వెళ్లి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేం? కేంద్రాన్ని ఎలా నమ్మాలో ముందు ఆచరణలో చూపాలి..’’ అని నోట్లో అభ్యర్థించనున్నారు.
మంగళవారం రాత్రి 8 గంటలకు జరిగే భేటీలో ఈ నోట్ను ఆంటోనీ కమిటీకి అందజేయనున్నారు. ఈ నోట్ రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సమైక్యాంధ్ర నేత ఒకరు మాట్లాడుతూ ‘‘విభజన నిర్ణయం జరిగిపోయిందని హైకమాండ్ తెగేసి చెప్పిన తర్వాత ఆంటోని కమిటీని కలవడం అనవసరమని అనుకున్నాం. అలా చేస్తే ఒకవైపు వాదనలే ప్రజల్లోకి వెళతాయనే భావనతో కమిటీకి ఈ సమస్యలన్నీ చెప్పాలనే నిర్ణయానికి వచ్చాం. సమస్యలకు ఆచరణాత్మక పరిష్కార మార్గాలు చూపిన తరువాత విభజనకు అభ్యంతరం లేదని చెబుతాం. మేం కమిటీ ముందుంచేవి అంత సులభంగా పరిష్కారమయ్యేవి కాదు. మా వాదన విన్న తర్వాతైనా హైకమాండ్ మనసు మార్చుకుంటుందేమో చూడాలి. కాదు, కూడదు అంటే ఎవరిదారి వారు చూసుకోవడమే..’’అని చెప్పారు.