
అడ్డుకోవడం సీమాంధ్రుల తరం కాదు: ఈటెల
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ ప్రెస్భవన్లో తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ (టీఆర్టీయూ) రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఈటెల రాజేందర్ బుధవారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ఇప్పటికే మొదలైందని.. అది జరిగినా.. జరగకపోయినా ముసాయిదా బిల్లు ఢిల్లీకి వెళ్లి ఆమోదం పొందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సీమాంధ్రుల తరం కాదన్నారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. అలాగే, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా 15 రోజుల్లోగా విడుదల చేయని పక్షంలో టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈనెల 30లోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డుల విషయంలో జారీ చేసిన 174,175,176 జీవోలు అసంబద్ధంగా ఉన్నాయునీ, వీటిని సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.