పిడికిలెత్తారు | Rural postal employees on indefinite strike | Sakshi
Sakshi News home page

పిడికిలెత్తారు

Mar 15 2015 2:41 AM | Updated on Sep 18 2018 8:18 PM

తపాలా శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుస్తున్న తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం

 ఐదో రోజుకు చేరిన గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె
 పాలకొల్లు :తపాలా శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుస్తున్న తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ తపాలా ఉద్యోగులు (జీడీఎస్) వాపోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెబాట పట్టారు. దేశంలో రెండున్నర లక్షలకు పైగా జీడీఎస్ ఉద్యోగులుండగా మన జిల్లాలో రెండువేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
 
 ఒకప్పుడు భారం.. నేడు వరం
 ప్రపంచంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పుల కారణంగా ఉత్తరాల బట్వాడా చతికిలబడింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 96,375 బ్రాంచి పోస్టాఫీసుల ద్వారా లభిస్తున్న ఆదాయమే తపాలాశాఖకు కీలకంగా మారింది. ఒకప్పుడు తపాలశాఖకు భారంగా భావించిన జీడీఎస్ ఉద్యోగులే నేడు ఆదాయ వనరులుగా మారారు. తపాలాశాఖ కేంద్ర, రాష్ట్రస్థాయిలో చేపడుతున్న అనేక పథకాలకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 96 లక్షలకు పైగా బ్రాంచి పోస్టాఫీస్‌ల ద్వారా రూ.10,400 కోట్లను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల కింద కూలీలకు సమర్థవంతంగా చెల్లించారు. అలాగే ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీల ద్వారా సుమారు రూ.76 వేల కోట్లు ఆదాయం సమకూర్చారు.
 
 జీతాలు పెంచాలని ఆందోళన
 గతంలో తపాలా శాఖ ఈ చిరుద్యోగుల పని గంటలను పెంచి వేతనాలను రూ.2,295 నుంచి రూ.4,575కు పెంచింది. అరుుతే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని జీడీఎస్‌లు కొంతకాలంగా ఆందోళనలు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో జీడీఎస్‌లు నాలుగు రోజులపాటు సమ్మె చేపట్టారు. దీంతో జీడీఎస్‌లను ఏడో వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని తపాలాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేగాక న్యాయమూర్తితో కమిటీ నియమించడానికి రాతపూర్వక ఒప్పందంతో తపాలా శాఖ అంగీకరించి సమ్మెను విరమింపచేసింది. జీడీఎస్‌ల పని పరిస్థితులు, వేతనాలు పరిశీలించడానికి జ్యుడీషియల్ కమిటీని నియమించాలని, టాస్క్‌ఫోర్సు నివేదిక ఆధారంగా తపాలాశాఖను కార్పొరేటీకరణ యత్నాలను ఆపాలని, జీడీఎస్‌లను రెగ్యులర్ చేసి డిపార్టుమెంట్ ఉద్యోగులు మాదిరిగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు.
 
 ఒప్పందాలను అమలు చేయాలి
 గతంలో జీడీఎస్‌లు సమ్మె చేయడంతో తపాలాశాఖ తమ డిమాండ్లను పరిష్కరించడానికి న్యాయమూర్తితో కమిటీ వేయడానికి ఒప్పదం కుదుర్చుకుంది. ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణం అప్పటి ఒప్పందాలను అమలు చేయాలి.
 - పమ్మి జయంతిరావు, జీడీఎస్ డివిజన్ కార్యదర్శి
 
 సమ్మె చేస్తున్నా పట్టదా
 మా సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకున్న నాథుడేలేడు. మా ఇబ్బందులను గుర్తించి సత్వర చర్యలు తీసుకోవాలి. నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నా జీతాలు పెంచడం లేదు.
 - ఎంవీ నర్సమ్మ, జీడీఎస్ ఎండీ, భీమలాపురం
 గొడ్డుచాకిరీ చేస్తున్నాం
 ఎంతో కాలంగా తపాలాశాఖలో గొడ్డు చాకిరీ చేస్తున్నాం. కనీసం దినసరి కూలీల మాదిరిగానైనా జీతాలు ఇవ్వడం లేదు. అన్ని రకాల ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నామాకు మాత్రం అరకొర వేతనాలే.  
 - గంటా శ్రీనివాసనాగరాజు, జీడీఎస్ యూనియన్ కోశాధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement