అందుబాటులోకి 21 సంజీవ‌ని బస్సులు | Sakshi
Sakshi News home page

క‌రోనా: జిల్లాల‌కు వెళ్ల‌నున్న‌ స‌ంజీవ‌ని బస్సులు

Published Wed, Jul 8 2020 2:37 PM

RTC Buses Turn to Sanjeevani Vehicles For Coronavirus Testing - Sakshi

సాక్షి, విజ‌య‌వాడ‌: ఇంద్ర బస్సులను సంజీవని బస్సులుగా మార్చామని, వీటి ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామ‌ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. వీటిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామ‌న్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు 21 సంజీవ‌ని వాహ‌నాలు ఏర్పాటు చేశామ‌ని, వాటిని అన్ని జిల్లాల‌కు పంపిస్తామ‌ని తెలిపారు. రానున్న 10 రోజుల్లో మ‌రో 30 వాహ‌నాలు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. తమిళనాడులో కేసులు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి బస్సులు నడపలేకపోతున్నామ‌న్నారు. (ఏపీఎస్ఆ‌ర్టీసీ చూపు.. కార్గో వైపు !)

"టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో క‌రోనా కేసులు వెలుగు చూసిన నేప‌థ్యంలో.. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు న‌డిపేందుకు బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సంచార రైతు బజారు కోసం ఆర్టీసీ బస్సులను తయారు చేశాం. కరోనా స‌మ‌యంలోనూ ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీకి రూ.4,200 కోట్ల నష్టం వచ్చింది, అయినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామ‌"ని మాదిరెడ్డి ప్ర‌తాప్ తెలిపారు. (ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే!)

Advertisement
Advertisement