రూ. 1,727 కోట్ల నష్టం | rs.1,727 crores loss as heavy rains wreak havoc in Andhra pradesh | Sakshi
Sakshi News home page

రూ. 1,727 కోట్ల నష్టం

Oct 28 2013 3:17 AM | Updated on Mar 28 2018 10:56 AM

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రూ.1,727 కోట్ల నష్టం వాటిల్లిందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రూ.1,727 కోట్ల నష్టం వాటిల్లిందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఆదివారం సహచర మంత్రులు జానారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి రఘువీరా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అనంతరం రఘువీరారెడ్డి మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. వర్షాల వల్ల 14 జిల్లాల్లోని 521 మండలాల పరిధిలో 4,200 గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. 42 మంది మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వర్షాలకు కూలిపోయిన 22 వేల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో పంటలు నష్టపోయిన వారికి రూ.1,600 కోట్లను విడుదల చేశామని, బాధితులందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. రాత్రి నల్లగొండ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో తుపాను నష్టంపై రఘువీరా సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 వరద బాధితుల్ని ఆదుకోవాలి: సీపీఐ
 
 హైదరాబాద్ : ప్రస్తుత వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో పాటు తుపాను కారణంగా మరణించిన వారిని ఆదుకోవాలని సీపీఐ శాసన సభాపక్ష నాయకుడు గుండా మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement