‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’ | Round Table Meeting Conducted In Andhra University Over Visakhapatnam Executive Capital | Sakshi
Sakshi News home page

‘పరిపాలన రాజధానిగా విశాఖను స్వాగతించాలి’

Feb 10 2020 2:42 PM | Updated on Feb 10 2020 3:21 PM

Round Table Meeting Conducted In Andhra University Over Visakhapatnam Executive Capital  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని  సీనియర్‌ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వి​కేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్‌ సరున్‌ రాజు, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు.

ఇక ప్రొఫెసర్‌ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి‌ మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement