మేలోగా నిర్వాసితులకు పునరావాసం

Rehabilitation of Polavaram Residents in May - Sakshi

సమన్వయంతో ‘పోలవరం’ పనులు సాగాలి

దాని ఆధారంగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపట్టాలి

వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లిస్తే ఈసీఆర్‌ఎఫ్‌ను నిరాటంకంగా పూర్తిచెయ్యొచ్చు

రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పోలవరం

ప్రాజెక్టు అథారిటీ దిశానిర్దేశం పోలవరం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ యాక్షన్‌ ప్లాన్‌

యథాతథంగా ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.5,500 కోట్లను రీయింబర్స్‌ చేయాలని అధికారుల వినతి

రూ.1,850 కోట్లు తక్షణమే విడుదలయ్యేలా చూస్తామన్న పీపీఏ సీఈఓ

సాక్షి, అమరావతి: గోదావరి నదిలో వరదలు ప్రారంభమయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. అప్పుడు వరద వచ్చినా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ మీదుగా దానిని మళ్లించి.. ప్రధాన ఆనకట్ట (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ – ఈసీఆర్‌ఎఫ్‌) పనులు నిరాటంకంగా చేయవచ్చునని.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని సూచించింది. ఇదే కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను యథాతథంగా ఆమోదించింది. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని తాము కేంద్రాన్ని కోరతామని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలను చేయాలని పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) చంద్రశేఖర్‌ అయ్యర్‌ సూచించారు. హైదరాబాద్‌లో గురువారం పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఇందులో.. ప్రాజెక్టు యాక్షన్‌ ప్లాన్‌ను ఇవ్వాలని సీఈఓ కోరడంపై రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావులు స్పందిస్తూ.. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.5,500 కోట్లను కేంద్రం ఇప్పటిదాకా రీయింబర్స్‌ చేయకపోవడాన్ని ప్రస్తావించారు. రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లు నవంబర్‌ 8న కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసిందని.. కానీ ఇప్పటికీ ఆ నిధులివ్వకుండా పనుల పూర్తికి యాక్షన్‌ ప్లాన్‌ అడగడం ఏమాత్రం బాగోలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని.. 2021 నాటికి పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై సీఈఓ స్పందిస్తూ.. రూ.1,850 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేస్తామని.. మిగతా నిధులు ఇచ్చేలా చూస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం వంతు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

పునరావాసం ఆధారంగా పనులు
పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో నిర్వాసితులకు పునరావాసాన్ని మే లోగా పూర్తి చేయగలిగితేనే, వరద జలాలను దిగువకు పంపడానికి కాఫర్‌ డ్యామ్‌ల ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీచేయాలని పీపీఏ సీఈఓ సూచించారు. ఆ లోగా సిŠప్‌ల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తిచేస్తే.. వరద నీటిని వాటి మీదుగా గోదావరి నదిలోకి మళ్లించవచ్చునన్నారు. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్‌ బాబూరావు స్పందిస్తూ.. బిల్లులు ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించకపోవడంవల్ల పనులు నత్తనడక సాగుతున్నాయన్నారు. దేవీపట్నంలో 45.72 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వచ్చే మరో వంద కుటుంబాలకు కూడా ఈ ఏడాది పునరావాసం కల్పిస్తే ముంపు సమస్య ఉండదన్నారు. ఇందుకు రూ.మూడు వేల కోట్లు అవసరం అవుతాయని.. అలాగే, ఈ నెల నుంచి ప్రతినెలా సగటున రూ.600 కోట్ల చొప్పున విడుదల చేస్తే మే నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరాసం కల్పించే పనులు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. దీనిపై చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పందిస్తూ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు.

ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో డీవాటరింగ్‌ పనులను నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. ప్రస్తుతం సిŠప్‌ల్‌ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని.. మే నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించామని వివరించారు. హెడ్‌ వర్క్స్, కుడివైపు కరకట్ట, ఎడమ వైపు కరకట్టలను పటిష్ఠం చేసే పనులకు సంబంధించిన ఎనిమిది డిజైన్‌లను కేంద్ర జలసంఘం ఆమోదించాల్సి ఉందన్నారు. దీనిపై పీపీఏ సీఈఓ స్పందిస్తూ.. ఈనెల 22న పీపీఏ భేటీని మరోసారి ఏర్పాటుచేస్తామని.. ఆ భేటీలో వాటిపై చర్చించి.. నెలాఖరులోగా డీడీఆర్‌పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సమావేశంలో డిజైన్లు ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి బీపీ పాండే, సీఈ ఏకే దివాన్, ఎస్‌ఈ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top