
పురుషోత్తం సాగర్ స్థలంపై మళ్లీ వివాదం
టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలో గల పురుషోత్తం సాగర్ స్థల వివాదం మరోసారి చెలరేగింది. సర్వే నంబర్ 55/3లో సుమారు ఏడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ
టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలో గల పురుషోత్తం సాగర్ స్థల వివాదం మరోసారి చెలరేగింది. సర్వే నంబర్ 55/3లో సుమారు ఏడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో కంచె వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో ఆదిఆంధ్రవీధి వాసులు అక్కడికి చేరుకున్నారు. తమ సంఘ నిధులు రూ.4 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టామని పేర్కొంటూ కంచెలకు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలను బలవంతంగా తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు చేపడతామని ఎస్సై పి.నర్సింహమూర్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదిఆంధ్రవీధివాసులు ఈ స్థలం తమకు కేటాయించారని మూడు రోజులు గడువు ఇస్తే ఆధారాలు తెస్తామని చెప్పారు. దీంతో దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు మూడు రోజుల గడువు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.