గడసాం పోస్టాఫీసులో డిపాజిట్లు స్వాహా!

Post master fraud in gadasam - Sakshi

రూ. 40 లక్షలు మింగేసిన ఇన్‌చార్జ్‌ పోస్ట్‌ మాస్టర్‌?

పెదమానాపురం ఎస్‌బీఎంకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

దత్తిరాజేరు(గజపతినగరం): నిరుపేదలు పైసాపైసా కూడబెట్టి దాచుకున్న మొత్తాలు గద్దల పాలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ము అక్కడి ఇన్‌చార్జి పోస్టుమాస్టరే కాజేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడశాంలో గ్రామానికి చెందిన పలువురు పేదలు దాచుకున్న రూ. 40 లక్షల వరకు అక్కడ ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్న చినకాద బీపీఎం శ్యాం, రన్నర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ,  గడసాం గ్రామానికి చెందిన విశ్రాంతి బీపీఎం బ్రహ్మం కమారుడు జగదీషకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో స్వాహా చేశారు.

కొద్దిరోజులుగా జగదీష్‌ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పెదమానాపురం ఎస్‌పీఎం(సబ్‌పోస్ట్‌ మాస్టర్‌) సత్యం సిబ్బందితో కలసి గురువారం గ్రామానికి వెళ్లి రికార్డులను పరిశీలింగా వందలాది మంది డిపాజిట్‌ దారులు దాచుకొన్న సోత్తు స్వాహా చేసినట్లు తేలింది. ఆయన విజయనగరం హెడ్‌ పోస్టాఫీస్‌లోని ఐపీఓ పోలేటికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రికార్డులను పరిశీలించి 100 ఖాతాలను సీజ్‌ చేశారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో తాము పరిశీలనకు వచ్చినట్టు పెదమానాపురం బీపీఎం సత్యం సాక్షికి తెలిపారు. వంద పాస్‌పుస్తకాలను సీజ్‌ చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఎంతమొత్తం గల్లంతయిందన్నది ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. మొత్తమ్మీద గ్రామంలో రూ. 40లక్షల వరకూ కాజేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top