పోస్టల్‌ బ్యా‘లేట్‌’!

Polling Staff Miss his Vote Right in Visakhapatnam - Sakshi

అందని పోస్టల్‌ బ్యాలెట్‌

ఓటు వేయలేకపోతున్న పోలింగ్‌ సిబ్బంది

నేటికీ బ్యాలెట్‌ అందని వారు వేలల్లోనే..

సీరియస్‌గా తీసుకోని జిల్లా యంత్రాంగం

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన పోలింగ్‌ సిబ్బంది 2300 మందే

ఆర్టీసీ సిబ్బంది 550, సిటీ పోలీస్‌ సిబ్బంది 1100,  

ఆర్మడ్‌ రిజర్వు సిబ్బంది 239 మంది

ఒక్కఓటు చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తారుమారు కావడానికి. అందుకే ప్రతి ఓటు విలువైనదంటారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని, అందరూ రాజాంగం కల్పించిన హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌ తపన పడుతుంటుంది. నూరు శాతం పోలింగ్‌ కోసం వందలాది కోట్లు ఖర్చు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తోంది.  పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సాధారణ ప్రజల మాట పక్కనపెడితే.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందే ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఉదాసీన వైఖరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోస్టల్‌ బ్యా లెట్‌లు అందకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలిసింది. అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు లేదనే విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో 4058 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సెక్టోరల్‌ ఆఫీసర్లు 399, రూట్‌ ఆఫీసర్లు 399, పోలింగ్‌ ఆఫీసర్లు 4553, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు 4553, అదనపు పోలింగ్‌ ఆఫీసర్లు 13,663, మైక్రో అబ్జర్వర్లు 2130 మంది చొప్పున 25,697 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరో 12వేల మంది వరకు వివిధ స్థాయిల్లో పోలీస్‌ సి బ్బంది పాల్గొన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు ఎంత తక్కువ లెక్కేసుకున్నా మరో వెయ్యి మంది వరకు పని చేశారు. ఇలా పోలింగ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ వేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిది.  ఎన్నికల్లో ప్రతిసారి శిక్షణ సమయంలోనే వీరికి ఓటు హక్కు వినియోగించుకునే వెలుసుబాటు కల్పిస్తారు. కానీ ఈసారి ఆ అవకాశం కల్పించలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఆ మేరకు కనీస ప్రచారం కూడా కల్పించలేదు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా తక్కువనే చెప్పాలి.

ఓటు వేసినవారు కేవలం 4,189 మందే..
ఎన్నికల విధుల్లో పాల్గొన్న 25,697 మంది సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏప్రిల్‌ 7వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. దీంతో 14,250 మంది మాత్రమే ఫారం–12 కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటి వరకు వీరిలో కేవలం 2,300 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. వీరిలో 1693 మంది పోలింగ్‌ ముందురోజు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిలో సిటీ పరిధిలో 1700 మంది పోలీసులకు కేవలం 1100 మంది మాత్రమే 2వ తేదీన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా 190 ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు కూడా వచ్చాయి. విశాఖ రీజియన్‌ పరిధిలో 690 మందిసిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే 550 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 140 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వేయలేకపోయారు. ఇక ఆర్మడ్‌ రిజర్వుడు సిబ్బంది  398 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారిలో 239 మంది ఓటు హక్కు వేశారు.

రెండు ఓట్లు వేసిన వారు తక్కువే
కాగా ఇప్పటి వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న వారిలో కనీసం సగం మంది కూడా రెండు ఓట్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారిలో సగానికి పైగా అసెంబ్లీ బ్యాలెట్‌ అందితే.. పార్లమెంటుబ్యాలెట్‌ అందలేదు. పార్లమెంట్‌ బ్యాలెట్‌ అందితే అసెంబ్లీ బ్యాలెట్‌ అందని అయోమయ పరిస్థితి నెలకొంది. కనీసం దరఖాస్తు చేసుకున్న వారికైనా పూర్తిస్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌లు అందాయా అంటే అదీ కన్పించడం లేదు. ఇప్పటికీ వందలాది మంది టీచర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసిన పోలింగ్‌ సిబ్బంది తమకు పోస్టల్‌బ్యాలెట్‌ ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తుందంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారు కూడా తమకు అసెంబ్లీ బ్యాలెట్‌ రాలేదని కొందరు..పార్లమెంట్‌ బ్యాలెట్‌ రాలేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

జాప్యం వెనుక పెద్దల ఒతిళ్లే కారణమా?
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే అవకాశం కల్పించడంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు కూడా బలంగా పని చేస్తున్నాయని విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికులు ఇలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల విసిగి వేసారిపోయారు. దీంతో వీరంతా మార్పు కోరుకుంటున్నట్టుగా స్పష్టం కావడంతో పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఇస్తే పడే ప్రతి ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడుతుందన్న భావనతో కావాలనే పోస్టల్‌ బ్యాలెట్‌ అందకుండా జాప్యం చేస్తున్నారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా నేతలు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందే ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ భాస్కర్‌ హామీ ఇచ్చారు.

ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలని కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు  మంగళవారం  వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ జిల్లాలో 14 వేలకు పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే కేవలం  2వేల మందికే పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వకపోవడానికి గల కారణమేంటని  కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఆర్టీసీ, అంగన్‌వాడీ, ఆశవర్కర్లకు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు వేసుకోవడాని తక్షణమే పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలని కోరారు.

ఈ ఎన్నికల్లో ఆశవర్కర్లతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగులను దూరంగా ఎన్నికల విధులకు పంపించారని, వారు పోస్టల్‌ బ్యాలెట్‌లు అడిగితే మీకు ఓట్లు లేవని అంటున్నారని కలెక్టర్‌కు వివరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో లేని నియమాలు విశాఖ జిల్లాకే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఓటు వేసుకునే హక్కు రాజ్యంగబద్దంగా అందరికీ ఉందని, దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని అన్నారు.  గత ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు రాలేదని, ఈ ఎన్నికల్లోనే ఎందుకు ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే  పోస్టల్‌బ్యాలెట్లు ఇవ్వడం లేదని  ఉద్యోగుల ఆరోపిస్తున్నారన్నారు. ఒక పౌరుడిగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఎందుకు కాలరాస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి భీశెట్టి సత్యవతి, సీనియర్‌నేత కుంభా రవిబాబు, అనకాపల్లి ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్, అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, సీనియర్‌నేత సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top