సీఎం సభా ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టు సభా ప్రారంభానికి ముందే, గురువారం సభా ప్రాంగణం పరిసరాలలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం, ఎం.రాజపురానికి చెందిన కొప్పర దుర్గారావు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం రాత్రి 9 గంటలకు బయటకు పొక్కింది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధితుని సోదరి కొప్పర జ్యోతి అందించిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కవిటి పంచాయతీ ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర దుర్గారావు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉల్లిభద్రలో ముఖ్యమంత్రి సభ వద్ద ఎండ్రిన్ తాగి, అనంతరం సమీపంలోని ఉన్న పోలీసు వద్దకు వెళ్లి, ఆతని కాళ్లపై పడి ‘నేను ఎండ్రిన్ తాగాను, చచ్చిపోతున్నాన’ని చెప్పాడు. దీంతో పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించారు. దుర్గారావుకు మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.