విల‘పింఛన్‌’! | Pension Delayed For AIDS Patients | Sakshi
Sakshi News home page

విల‘పింఛన్‌’!

Dec 6 2018 1:23 PM | Updated on Dec 6 2018 1:23 PM

Pension Delayed For AIDS Patients - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): తమ రోగాన్ని ఎవరికీ చెప్పుకోలేని అభాగ్యులు వారు. తెలిసో తెలియకో చేసిన తప్పునకు హెచ్‌ఐవీ బారిన పడి జీవితాంతం బాధపడుతూ నరకం అనుభవిస్తున్నారు. వారి ఇబ్బందులను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పింఛన్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని నీరుగారుస్తోంది. మొత్తం బాధితుల్లో 10 శాతం మందికి కూడా పింఛన్‌ ఇవ్వడం లేదు. అది కూడా అరకొరగా ఇస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో 19,863 మంది ఎయిడ్స్‌ బాధితులు..
జిల్లాలో 2009 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 6,65,187 మందికి వైద్య పరీక్షలు చేయగా  18,776 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే 5,58,661 మంది గర్భిణులను పరీక్షించి 1,087 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తంగా జిల్లాలో 19,863 మంది ఎయిడ్స్‌ బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తేల్చింది. సాధారణ ప్రజల్లో 1.38శాతం, గర్భిణుల్లో 0.06 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో ఏఆర్‌టీ చికిత్స కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య అక్టోబర్‌ వరకు 19,377  మంది కాగా క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారి సంఖ్య కేవలం 9,894 మంది మాత్రమే. ఏఆర్‌టీ ప్లస్‌ కేంద్రాల్లో రెండో రకం మందులు క్రమం తప్పకుండా వాడుతున్న వారి సంఖ్య 205. అయితే వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందడంలేదు.

బాధితులకు అరకొర సేవలు
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం వంద మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్కరికీ మంజూరు కాలేదు. ఐసీడీఎస్‌ ద్వారా 600 మంది హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు డబుల్‌ న్యూట్రిషన్‌  గోప్యంగా అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఐసీడీఎస్‌లోని ఐసీపీఎస్‌ ద్వారా 135 మంది చిన్నారులకు మాత్రమే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.500 ఇస్తున్నారు.  

222 మందికి మాత్రమే పింఛన్‌
జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 19,863 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 222 మందికి మాత్రమే రూ.1000ల చొప్పున ఫించన్‌ అందిస్తున్నారు. అందులోనూ కొందరికి సక్రమంగా అందడం లేదు. అధికారులు ఆన్‌లైన్‌లో అందరి వివరాలు పంపినా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందరికీ పింఛన్‌ మంజూరు చేయాలని కోరాం
హెచ్‌ఐవీ బాధితుల వివరాలన్నీ ప్రభుత్వానికి పంపించాం, అందరికీ పింఛన్‌ మ ంజూరు చేయాలని కోరాం. ఏఆర్‌టీ కేం ద్రంలో గతంలో నెలకోసారి మాత్రమే మం దులు ఇచ్చేవారు. ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా మందులు ఒకేసారి తీసుకెళ్లే అవకాశం కల్పించాం. – డాక్టర్‌ చంద్రారావు,అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement