సగం మందికి సబ్సిడీ లేదు! | No subcidy to Gas consumers without Aadhar card | Sakshi
Sakshi News home page

సగం మందికి సబ్సిడీ లేదు!

Aug 30 2013 1:42 AM | Updated on Sep 1 2017 10:14 PM

నగదు బదిలీ అమల్లో ఉన్న ఐదు జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు ‘ఆధార్’ గుబులు పట్టుకుంది. బ్యాంకు ఖాతాలు, వంటగ్యాస్ కనెక్షన్లతో ఆధార్ విశిష్ట సంఖ్య అనుసంధానానికి గడువు ఇక రెండు రోజులే మిగిలింది.

సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీ అమల్లో ఉన్న ఐదు జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు ‘ఆధార్’ గుబులు పట్టుకుంది. బ్యాంకు ఖాతాలు, వంటగ్యాస్ కనెక్షన్లతో ఆధార్ విశిష్ట సంఖ్య అనుసంధానానికి గడువు ఇక రెండు రోజులే మిగిలింది. ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో.. ఇప్పటికి 47 శాతం మంది ఆధార్ నంబర్ల అనుసంధానం మాత్రమే పూర్తయింది. యంత్రాంగం నిర్లక్ష్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా 24 లక్షలకు పైగా వినియోగదారులకు సబ్సిడీ అందకుండా పోతోంది. ఆదివారం నుంచి వీరంతా గ్యాస్ సిలిండర్‌ను రూ.962 చెల్లించి కొనుగోలు చేయక తప్పని స్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబరు 1నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
 
 ఈ జిల్లాల్లో 48,18,279 మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకూ 22,28,573 మందికి(46.25 శాతం) ఆధార్ ప్రక్రియ పూర్తయింది. శనివారం లోగా మరో 3.75 శాతం పూర్తయినా.. మిగతా 50 శాతం గ్యాస్ వినియోగదారులకు వంటగ్యాస్ సబ్సిడీ తాత్కాలికంగా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆధార్, వంటగ్యాస్ కంపెనీలు, బ్యాంకుల మధ్య సమన్వయ లోపమే సమస్యగా మారిందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆధార్ నంబర్ పొందలేకపోయిన వారు కొందరైతే.. ఆధార్ నంబర్ పొంది, గ్యాస్ ఏజన్సీ, బ్యాంకులకు అందజేసిన వారి విషయంలో కూడా అనుసంధానం జరగడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement