రైతులకు మేలు చేసేందుకే నగదు బదిలీ పథకం

Sajjala Ramakrishna Reddy Comments On Direct Cash Transfer Scheme - Sakshi

సాక్షి, తాడేప‌ల్లి  : న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం వ‌ల్ల రైతుల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సంస్కరణల్లో భాగంగా రైతులకు నగదు బదిలీ చేస్తున్నార‌ని, రైతులకు మేలు చేసేందుకే నగదు బదిలీ పథకమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఉచిత విద్యుత్ సరఫరాపై టీడీపీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుంద‌ని మండిప‌డ్డారు. అప్పు కోసమని, ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికే నగదు బదిలీ పథకమని త‌ప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగల మీద చంద్రబాబు బట్టలు అరేసుకోవాలన్నార‌ని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు..వి ద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే చంద్రబాబు కాల్పులు జరిపించార‌ని గుర్తు చేశారు. (మహానేత స్ఫూర్తితోనే వైఎస్‌ జగన్‌ పరిపాలన)

నగదు బదిలీ పథకం వ‌ల్ల‌ రైతులకు ఎలాంటి నష్టం జరగద‌ని స‌జ్జ‌ల రామకృష్ణ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అనేది దివంగ‌త నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన పథక‌మ‌ని, 1100 కోట్లు కరెంట్ బకాయిలను ప్రమాణ స్వీకారం రోజే వైఎస్సార్‌ రద్దు చేశార‌ని ప్ర‌స్తావించారు. ఉచిత విద్యుత్ పేటెంట్ రాజశేఖర్ రెడ్డిద‌ని, నేడు తండ్రి బాటలోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నడుస్తున్నార‌న్నారు. 5 ఏళ్ళు పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సీఎంప్లాన్ చేస్తున్నార‌ని తెలిపారు.ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నార‌ని, 9 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం ఫీడర్లకు 1700 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. (బాబు చివరకు పాల వ్యాపారాన్నీ వదల్లేదు’)

‘ప్రజలు ఖాతాల్లో నగదు జమ చేయడం వలన జవాబుదారీతనం పెరుగుతుంది. రైతుల ఖాతాల్లో వేసిన డబ్బు వేరే వాటికి బ్యాంక్‌లు జమ చేసుకోవడానికి వీల్లేదు. ఒక వేళ డబ్బు రైతుల ఖాతాల్లో వేయడం అలస్యమైనప్ప‌టికీ ఉచిత విద్యుత్ ఆపరు. రైతులకు ఎస్క్రో అకౌంట్స్ ఇస్తున్నాం. విద్యుత్ మీటర్లు బిగించడం వలన రైతులు ఎంత విద్యుత్ ఉపయోగించుకుంటున్నారో తెలుస్తుంది. తల తోక లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిస్కములకు చంద్రబాబు వేల కోట్ల బకాయిలు పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అప్పును 3 లక్షల 60 వేల కోట్లకు పెంచారు.

ఎఫ్ఆర్‌బీఎమ్‌కు నిబంధనలకు అనుగుణంగా అప్పు చేస్తున్నాము. అప్పు దేనికి తెచ్చామో కూడా మేము లెక్కలు చెప్పాగ‌లుగుతాము. టీడీపీ తెచ్చిన అప్పు మీద లెక్కలు చెప్పగలరా.. ఎన్నికల్లో ఓట్లు కోసం వైఎస్ జ‌గ‌న్‌ పథకాలు ప్రవేశ పెట్టలేదు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో, విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రజలు చనిపోతే చంద్రబాబు రాలేదు. అవినీతి, మర్డర్‌‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. ప్రజలు చంద్రబాబు చేసే పనులను గుర్తు పెట్టుకుంటారు.’  అని స‌జ్జ‌ల మండిప‌డ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top