ఆగని అన్నదాత మృత్యుఘోష | no stop to former's suicides | Sakshi
Sakshi News home page

ఆగని అన్నదాత మృత్యుఘోష

Jan 24 2015 11:12 AM | Updated on Sep 2 2017 8:12 PM

జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు.

 జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో కొందరు, పాలకుల వైఖరితో మరికొందరు, బ్యాంకుల నోటీసుల అవమానాలతో ఇంకొందరు మనస్తాపానికి గురై నేలకొరుగుతున్నారు. బతకడానికి దారులు మూసుకుపోవడంతో చావులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
 మరో విషాదం: గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి చెందిన యరముల వెంకటరెడ్డి (50) పురుగుమందుకు బలైపోయాడు.  వెంకటరెడ్డి తనకున్న పదమూడెకరాల పొలంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల్ని సాగు చేశారు. బోర్లను నమ్ముకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి కరుణించడంతో ఇల్లు కూడా కట్టుకున్నాడు. పొలంలో వేసిన బోర్లలో నీరు తగ్గిపోవడం, పంటలు ఎండిపోతుండటం,  మరోవైపు అప్పులు 30 లక్షలు దాటిపోవడంతో పొలానికి పిచికారీ చేసే పురుగుమందు తీసుకుని చనిపోయాడు.
 జనవరి17న: యద్దనపూడి గ్రామానికి చెందిన రైతు గొట్టిపాటి ఆదియ్య పురుగుమందు తాగి చనిపోయాడు. రైతు కాస్తా కౌలు రైతుగా మారిన ఆదియ్య వ్యవసాయంపై మక్కువ తీరక, వేరే ఉపాధి లేక ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ వచ్చాడు, గత ఏడాది శనగ సాగు చేసి గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోయాడు. ఈ ఏడాది మళ్లీ పత్తి సాగు చేశాడు. దీని కోసం కుమార్టె బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఈ ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడులు కూడా తగ్గడంతో ఆందోళనతో ఉన్న ఆదియ్య, రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు రావడంతో  పురుగుమందును ఆశ్రయించాడు.
 సెప్టెంబరు 23న: పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ గత ఏడాది సెప్టెంబర్ 23న పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తనకు ఉన్న కొద్దిపాటి భూమితోపాటు కౌలు సాగు చేస్తుంటాడు. ఇతనికి సొంతపొలం ఎకరం 38 సెంట్లుండగా, నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.  తన సొంత భూమిలో రూ.20 పెట్టుబడితో గోరుచిక్కుడు సాగు చేయగా తెగుళ్లు సోకి పంట చేతికి రాలేదు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా వర్షాలు లేకపోవడంతో ఎకరంన్నరలోనే వరి వేశాడు.  కౌలు పొలంలో ఎకరంన్నర సాగు చేసిన వరి నీరు సకాలంలో అందక ఎండుముఖం పట్టింది. అప్పటికే 25 వేలు ఖర్చు చే శాడు. మిగిలిన రెండున్నర ఎకరాలలో వర్షాలు సక్రమంగా సాగు చేయలేదు. దీంతో గతంలో ఉన్న అప్పులతోపాటు సాగు సక్రమంగా లేక రైతు ఆత్యహత్య చేసుకున్నాడు.  
 నవంబరు 28న: యద్దనపూడి మండలంలోని చిమటవారిపాలెం గ్రామానికి చెందిన రైతు గనిపిశెట్టి వెంకట్రావు(52) గత ఏడాది నవంబర్ నెల 28న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. రుణమాఫీ అవుతుందో లేదో తెలియక బ్యాంకులో పాసు పుస్తకాలుపై తీసుకున్న అప్పు బ్యాంకులు నోటీసులివ్వడంతో ఒన్‌టైమ్ సైటిల్ మెంట్‌కు దరఖాస్తు చేశాడు. మొత్తం లక్షా 80 వేల వరకూ బకాయి ఉండగా 96 వేల రూపాయలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. అప్పు తెచ్చి రూ.95 వేలు బ్యాంకులో జమచేశాడు. డబ్బులు కట్టిన తర్వాత కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పకున్నారు.  పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరినా బ్యాంకర్లు సకాలంలో ఇవ్వకపోవడంతో అవమానంగా భావించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునట్లు లేఖరాసి ప్రాణాలు తీసుకున్నాడు.
 రుణమాఫీ కాకపోవడం, బ్యాంకు అధికారుల ఒత్తిడి ఫలితంగా పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామానికి చెందిన రైతు కరేటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. తన భార్య పేరుతో బంగారం తాకట్టు పెట్టి రెండు విడతలుగా రుణం తెచ్చుకున్నాడు. మొదటి విడత తెచ్చిన రుణం పూర్తిగా చెల్లించినా రెండో విడత రుణం కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. డబ్బు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement