నైజీరియా దేశస్తుడికి రెండు కేసులకు సంబంధించి ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి ఐదో అదనపు జూనియర్ జడ్జి విజయ బుధవారం తీర్పు చెప్పారు.
తిరుపతి లీగల్ : నైజీరియా దేశస్తుడికి రెండు కేసులకు సంబంధించి ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి ఐదో అదనపు జూనియర్ జడ్జి విజయ బుధవారం తీర్పు చెప్పారు. గతేడాది జూన్ 25న తిరుపతి వేదాంతపురంలోని వి. వెంకటరమణ నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి వచ్చి నైజీరియాకు చెందిన ఇమాన్యుయల్ అలియాస్ జాయ్ ఎడ్వర్డ్ను పోలీసులు విచారించారు. అతని వీసా, పాస్పోర్టును పోలీసులు పరిశీలించగా పేరు, పుట్టిన తేదీ, వీసా తేదీలు వేర్వేరుగా ఉన్నాయి.
ఆ సమాచారాన్ని భారత ప్రభుత్వ హైకమిషనర్కు పంపి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరోవైపు కరెన్సీ విషయంలో ఎడ్వర్డ్ తనను మోసం చేస్తున్నాడని వెంకటరమణనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎడ్వర్డ్ను నిందితుడుగా కేసు నమోదు చేశారు. పై రెండు కేసుల్లోను నేరం రుజువు కావడంతో ఎడ్వర్డ్కు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.