చంద్రబాబు ఊసరవెల్లి | Naidu Chameleon | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఊసరవెల్లి

Nov 23 2014 2:14 AM | Updated on Sep 2 2017 4:56 PM

చంద్రబాబు ఊసరవెల్లి

చంద్రబాబు ఊసరవెల్లి

ఊసరవెల్లి రంగులు మార్చిన తరహాలో సీఎం చంద్రబాబు మాటలు మార్చే నేర్పరి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

ఇందుకూరుపేట: ఊసరవెల్లి రంగులు మార్చిన తరహాలో సీఎం చంద్రబాబు మాటలు మార్చే నేర్పరి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల మండల అధ్యక్షుల నిమాయక ప్రక్రియను జగదేవిపేటలోని పిడూరు సునీల్‌రెడ్డి నివాసంలో శనివారం నిర్వహించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు.

పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని, అది కూడా ఒక్కో ఇంటికి రూ.1.5 లక్ష మాత్రమేనని పేర్కొనడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయన డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు బ్యాంకుల నుంచి పొందిన స్వల్ప, దీర్ఘకాలిక, ప్రాసెసింగ్ తదితర రుణాలన్నీ వ్యవసాయ రుణాల కిందకే వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా తెలివైన వ్యక్తినని, సీఈఓనని ప్రచారం చేసుకునే చంద్రబాబుకు వ్యవసాయ రుణాలకు, పంట రుణాలకు తేడా తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు.

రుణాలు కట్టవద్దని, తాకట్టుపెట్టిన నగలు, డాక్యుమెంట్లు ఇంటికి వస్తాయని ఆయన చెప్పిన మాటలు నమ్మి రైతులు నిలువున మోసపోయారన్నారు. వడ్డీల భారం పడటమే కాక పంటలు నష్టపోయిన పలువురు బీమా సౌకర్యం సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశౠరు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు ఆర్థిక సమస్యలంటూ వాటిని నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు కూడా నాటకాలాడుతున్నారన్నారు.

నెల్లూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ హాజరైతే లాఠీలతో కొట్టించి బయటకు నెట్టించేసిన ఓ ఇన్‌స్పెక్టర్ వాడరాని భాష వాడారన్నారు. ఆయన చరిత్ర అంతా సేకరించి ఉన్నతాధికాారులకు నివేదించానన్నారు. కొడవలూరు ఎంపీడీఓ కూడా అలాగే ఉన్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.15 లక్షల నుంచి నుంచి రూ.20 లక్షల వరకు అవినీతి జరిగిందన్నారు.

అధికారుల్లో 60 శాతం మంది నిజాయితీగా వ్యవహరిస్తుండగా 40 శాతం మంది పచ్చా చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి వైఎస్సార్‌సీపీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసన్నశ్రావణ్‌కుమార్, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, కొళ్లపూడి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement