ఈ పరిస్థితుల్లో మున్సి‘పోల్స్’ అసాధ్యం | Municipal elections is impossible at present | Sakshi
Sakshi News home page

ఈ పరిస్థితుల్లో మున్సి‘పోల్స్’ అసాధ్యం

Feb 14 2014 3:37 AM | Updated on Nov 9 2018 5:52 PM

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నివేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘సుప్రీం’ తలుపుతట్టాలని ప్రభుత్వ నిర్ణయం
హైకోర్టు ఆదేశాలపై ఎస్‌ఎల్పీ దాఖలుకు సిద్ధం
 

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నివేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలను నాలుగు వారాల్లో నిర్వహించాలంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ) దాఖలు చేయడానికి సిద్ధమైంది. తాము ఆదేశాలిచ్చినా మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటోందెవరు? పేర్లు వెల్లడించండంటూ హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ అధికారులు మూడ్రోజుల కిందట పంపిన ఫైలును ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఎస్‌ఎల్పీని గురువారమే సిద్ధం చేసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఆమోదం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రతి అధికారికంగా అందిన వెంటనే ఈ ఎస్‌ఎల్పీని సుప్రీంకోర్టులో దాఖలు చే యనున్నారు.
 
 వాయిదాకే సీఎం మొగ్గు...
 రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు 2010 సెప్టెంబర్ నుంచి ఎన్నికలు లేవు. వాటి నిర్వహణ కోసం పలువురు కోర్టుకెళ్లినా... ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికలతో సంబంధం లేకుండా మున్సి‘పోల్స్’ నిర్వహించడానికి తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలోనే నాలుగు వారాల్లో నిర్వహించాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు  146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 9 నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ఎన్నికల వాయిదాకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొగ్గు చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement