
మాయం చేశారు!
మూతపడిన ఓ గ్రానైట్ క్వారీలో ఉన్న అతి విలువైన గ్రానైట్ బ్లాకులను శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు తరలించుకుపోయారు. ఈ విషయాన్ని కొందరు స్థానికులు గనుల శాఖ
టెక్కలి, న్యూస్లైన్: మూతపడిన ఓ గ్రానైట్ క్వారీలో ఉన్న అతి విలువైన గ్రానైట్ బ్లాకులను శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు తరలించుకుపోయారు. ఈ విషయాన్ని కొందరు స్థానికులు గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకువె ళ్లగా, తమ పరిధి కాదనే సాకుతో తప్పించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవి అధికారుల స్వాధీనంలో ఉన్నవే కావడం విశేషం. టెక్కలి మండలం పెద్దసాన, కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామాల సరిహద్దులో ఏర్పాటైన ఓ గ్రానైట్ కంపెనీ సుమారు నాలుగేళ్ల క్రితం మూత పడింది. ఆ కంపెనీకి చెందిన క్వారీలో సుమారు రూ.90 లక్షల విలువైన 24 గ్రానైట్ బ్లాకులు ఉండిపోయాయి. సదరు కంపెనీ గనుల శాఖకు పన్నులు, రాయల్టీల రూపంలో పెద్ద మొత్తంలో బకాయిపడిన నేపథ్యంలో అధికారులు క్వారీని, అందులోని బ్లాకులను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. క్వారీలో ఉన్న బ్లాకులపై కొందరు గ్రానైట్ వ్యాపారుల కన్ను పడింది.
వాటిని తరలించుకపోయేందుకు ఇంతకుముందే కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా అధికార పార్టీ కీలక నేత కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్త వాటిపై కన్నేశాడు. రెండు రోజుల క్రితం బ్లాకులను తరలించేందుకు ప్రయత్నించగా సమీప గ్రామస్తులు అడ్డుకున్నారు. దాంతో సదరు వ్యాపారవేత్త ప్లాన్ మార్చాడు. క్వారీ సమీపంలోని గ్రామాల్లో కొందరికి లక్షల రూపాయలు ఎరగా వేశాడు. అడ్డు చెప్పకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు శుక్రవారం ఆర్ధరాత్రి భారీ క్రేన్ తీసుకొచ్చి సుమారు 16 బ్లాకులను చీకటిమాటున తరలించేశాడు. వాటిని కోటబొమ్మాళి సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్కు చేర్చినట్లు తెలిసింది. మిగి లిన బ్లాకులను కూడా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ తరలింపు గుర్తించి తెలుసుకున్న మరికొందరు స్థానికులు టెక్కలి మైన్స్ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ క్వారీ తమ పరిధిలో లేదని, జిల్లా అధికారులే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పి తప్పించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఇదే విషయమై ‘న్యూస్లైన్’ జిల్లా మైన్స్ అధికారిని సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
అధికారుల పాత్రపై అనుమానాలు
లక్షల రూపాయల విలువైన, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న గ్రానైట్ బ్లాకులను అక్రమంగా తరలించుకుపోతుంటే మైన్స్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన సొత్తును రక్షించాల్సిన అధికార యంత్రాంగం కుంటి సాకులతో తప్పించుకోవడం ద్వారా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో మూత పడిన కొన్ని క్వారీల్లో ఇటువంటి దందాలు జరుగుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అధికారుల దన్నుతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.