మేడికొండూరులో పోలీస్ పికెట్ | Sakshi
Sakshi News home page

మేడికొండూరులో పోలీస్ పికెట్

Published Mon, Mar 30 2015 3:24 AM

Medikondurulo police picket

మేడికొండూరు: మేడికొండూరు మండలంపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మేడికొండూరులో ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత రాతలు రాసిన విషయం విదితమే. ఈ మేరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనను పోలీసులు సవాలుగా స్వీకరించి అనుచిత రాతలు రాసిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు.  

వివాదస్పద, అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో ఉన్న పలువురు పోలీసు అధికారులు మేడికొండూరులో తిష్టవేశారు. ఈద్గా వద్ద పోలీసులకు దొరికిన కీలకమైన ఆధారంగా కేసును దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారని గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు.
 
కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన
మండల కేంద్రమైన మేడికొండూరు ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచితరాతలు రాసిన ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులను, సిరిపురంకు చెందిన ముగ్గురిని, మందపాడు గ్రామానికి చెందిన ఇద్దరిని అనూమానంతో స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో తమ పిల్లలు ఏ నేరం చేశారని పోలీసు స్టేషన్ వద్ద వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విచారణ నిమిత్తంగా తీసుకొచ్చామని విచారణ పూర్తయిన అనంతరం పంపుతామని వారితో సీఐ రమేష్‌బాబు చెప్పారు.

Advertisement
Advertisement