ఎందరో అమరులు | Martyrs Sacrifices is telangana state | Sakshi
Sakshi News home page

ఎందరో అమరులు

Feb 20 2014 2:43 AM | Updated on Nov 6 2018 8:28 PM

దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించనుంది. దీని వెనుక ఎందరెందరివో త్యాగాలు ఉన్నాయి.

కామారెడ్డి, న్యూస్‌లైన్ :  దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించనుంది. దీని వెనుక ఎందరెందరివో త్యాగాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో పేగు బంధాన్ని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో రక్త సంబంధాన్ని, కట్టుకున్నవారితో అనుబంధాన్ని, స్నేహబంధాలను తెంచుకుని వెళ్లిపోయిన వారెం దరో... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆత్మహత్యల కు పాల్పడ్డారు. కొందరు ఉరితాడును ముద్దాడితే, మరికొందరు నిప్పం టించుకున్నారు.

ఇంకొందరు రైలుకు ఎదురుగా వెళ్లి తనువులు చాలించా రు. ఎక్కడా లేని విధంగా స్వయంపాలన కోసం బలవన్మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం మరీ మరణ వాంగ్మూలాలు రాసి వెళ్లిపోయారు. ఆత్మహత్యలను ఉద్య మ రూపంగా మార్చుకున్న తీరు ఎక్క డా కనిపించదు. తెలంగాణవ్యాప్తంగా 1200 వందల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడితే జిల్లాకు చెందినవారు 30మందికి పైగా ఆ జాబితాలో ఉన్నారు. తెలంగాణ కల సాకారమైన వేళ అన్ని వర్గాల ప్రజ లు అమరులను స్మరించుకుంటు న్నారు. వారి త్యాగాలు వృథా పోలేదని, వారు కలలు గన్న రాష్ట్రం వచ్చిందని అంటున్నారు. తెలంగాణ రాష్ర్టంలో అన్ని రకాలుగా న్యాయం జరిగినపుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అంటున్నారు.

 ఎన్‌కౌంటర్‌లో అసువులుబాసిన  జనసభ సుదర్శన్
 టీఆర్‌ఎస్ ఆవిర్భావానికన్నా ముందే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ జనసభను జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసిన టి.సుదర్శన్ ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగారు. నక్సల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమయంలో 2005 జనవరి 16న మావోయిస్టుల వద్దకు వెళ్లిన సందర్భంలో ఈ ఎన్‌కౌం టర్ జరిగింది. ఆయన జనసభ రాష్ట్రకమిటీ సభ్యునిగా, జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. రైల్వే మెయిల్ సర్వీసెస్ డిపార్టుమెంటులో పనిచేసిన సుదర్శన్ తెలంగాణ కోసం తపించి అమరుడయ్యాడు.

 తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య
 భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య కేసీఆర్ దీక్షను భగ్నం చేసిన సందర్భంలో 2009 నవంబర్ 30న కామారెడ్డి పట్టణంలో ఓ సెల్ టవర్‌పైకి ఎక్కి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నా డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలకు న్యా యం జరుగుతుందని ఆయన మరణ వాంగ్మూలంగా రాసుకున్న లేఖ లో స్పష్టంగా పేర్కొన్నాడు.

 ఏకే 47తో  కాల్చుకున్న  కానిస్టేబుల్ గంగాధర్
 మాక్లూర్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన గంగాధర్ 2009 డిసెంబర్ 22న స్టేషన్‌లోనే ఏకే 47తో కాల్చుకున్నాడు. తెలంగాణ కోసం ఆయన బలిదానానికి పాల్పడ్డాడు.

 పురుగుల మందు తాగి బత్తుల రాజు
 తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త బత్తుల రాజు సూసైడ్ నోట్ రాసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో క్రియాశీల కంగా పనిచేసిన యువకుడు. ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది.

 రైలుకు ఎదురెళ్లిన కరీం
 తాడ్వాయి మండలం కన్కల్ గ్రామాని కి చెందిన క రీం తెలంగాణ కోసం రైలుకు ఎ దురెళ్లి ఆత్మబలిదానం చేశాడు. కోపోద్రిక్తులైన ఉద్యమకారులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేవగిరి రైలుపై రాళ్లదాడి చేశారు. కరీం శవంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీలో కొనసాగిన ఎమ్మెల్యే అదే రోజు ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కలిశారు.
 పట్టాలపై పడుకుని రమేశ్
 సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న బెంగతో స్థానిక రైల్వేస్టేషన్‌లో పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేశ్ అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొని కన్నీటి నివాళులర్పించడమే గాక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రమేశ్ మరణం ఆయన కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది.

 ఉరిపోసుకుని కడెం నరేశ్ మృతి
 తెలంగాణ కోసం కడెం నరేశ్ ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇతనిది మాచారెడ్డి మండలం ఇసాయిపేట. కామారెడ్డిలో నివాసముంటూ చదువుకుంటున్న నరేశ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఆయన మృతితో కన్నవారికి ఆసరా లేకుండాపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement