
షాపింగ్ కు వెళ్లింది..తిరిగి రాలేదు..!
షాపింగ్ కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం అయిన సంఘటన హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ (సుల్తాన్బజార్ ) : షాపింగ్కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం అయిన సంఘటన హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బాల్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంపేట్ రసూల్పూరా కృష్ణానగర్కు చెందిన పి.బాల్రాజ్ భార్య అనిత(30) తన బంధువులైన స్రవంతి, స్వాతి, మహేశ్వరిలతో కలిసి గురువారం కోఠికి షాపింగ్ కోసం వెళ్లారు. అయితే మధ్యలో అనిత కనబడకపోవడంతో వారు భర్త బాల్రాజ్కు సమాచారం అందించారు. భార్య సెల్ఫోన్కు ఫోన్ చేయగా అది స్విచ్ఆఫ్లో ఉంది. భర్త ఇతర బంధువులతో కలిసి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వెదికి, తెలిసినవారిని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సుల్తాన్బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.