తాగిన మత్తులో కల్వర్ట్‌లో పడి వ్యక్తి మృతి

Man Died In A Canal In Srikakulam - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌ : మద్యం మహమ్మారికి ఓ నిండు ప్రాణం బలైంది. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి.. ఆ మత్తులో కల్వర్ట్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫలితంగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన కొచ్చెర్ల భాస్కరరావు(37) ఒడిశా కె.సువాని వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నారు.

మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం ఉదయం పంట పొలానికి వెళ్లొస్తానని భార్య స్వాతికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం తాగి లొద్దపుట్టి జాతీయ రహదారి పక్కనున్న కల్వర్ట్‌ గోడ(కానా)పై కూర్చున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదవశాత్తూ తూలి వెల్లకిలా లోతుగా ఉన్న కల్వర్ట్‌ గోతిలో పడిపోయారు. కింద ఉన్న రాళ్లకు  తల బలంగా ఢీకొంది.

దీనిని గమనించిన స్థానికులు కొందరు వెంటనే కల్వర్ట్‌లోకి దిగి భాస్కర్‌ను పైకి తెచ్చారు. అప్పటికే భాస్కరరావు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించే సమయానికే మృతిచెందారు. మృతుడికి భార్య స్వాతితో పాటు కుమారులు దిలీప్‌(8), జనార్దన్‌(7) ఉన్నారు.

బంధువులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. మద్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్‌ఐ ఇ.నాగార్జున కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top