జయహో... మల్లమ్మా | Mallamma gets Ideal farmer award | Sakshi
Sakshi News home page

జయహో... మల్లమ్మా

Mar 8 2014 2:48 AM | Updated on Sep 27 2018 3:20 PM

జయహో... మల్లమ్మా - Sakshi

జయహో... మల్లమ్మా

ప్రాథమిక విద్య కూడా దాటలేదు కానీ కాబోయే ఐఏఎస్ అధికారులకు అభివృద్ధి పాఠాలు చెప్పారు. మహిళా సంఘాల ఏర్పాటుపై, సభ్యుల ఆర్థికాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు.

బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్య కూడా దాటలేదు కానీ కాబోయే ఐఏఎస్ అధికారులకు అభివృద్ధి పాఠాలు చెప్పారు. మహిళా సంఘాల ఏర్పాటుపై, సభ్యుల ఆర్థికాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. మేలైన దిగుబడులు సాధించి సాగులోనూ భేష్ అన్పించడమే గాక ఆదర్శ రైతు అవార్డు కూడా అందుకున్నారు. మహిళా శక్తికి చిరునామాగా నిలిచిన ఆమె పేరు మల్లమ్మ. ఊరు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం. మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా చేరిన ఆమె అనతికాలంలోనే గ్రామ సంఘం లీడర్‌గా ఎదిగారు. సంఘాల ఏర్పాటుతో పాటు పొదుపు, బ్యాంకు రుణాల ద్వారా సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఎంతో కృషి చేశారు.
 
  గతేడాది జాతీయ ఆహార భద్రత పథకం కింద మహిళా సంఘం తరఫున నిత్యావసరాలను టోకుగా కొనుగోలు చేసి వాటిని సభ్యులకు చౌక ధరకే, అది కూడా రుణాలపై అందజేయడంలో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిటీ రిసోర్‌‌స పర్సన్ (సీఆర్పీ)గా ఎంపికై మహిళా సంఘాల ఏర్పాటు, ఆవశ్యకతపై పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్లగొండ, వైజాగ్, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో అవగాహన కల్పించారు. 2004లో స్టేట్ రిసోర్‌‌స పర్సన్ (ఎస్‌ఆర్పీ)గా అనేక జిల్లాల్లో సంఘాల అభివృద్ధికి పాటుపడ్డారు. మల్లమ్మ జైత్రయాత్ర అంతటితో ఆగలేదు. ఐకేపీ సహకారంతో హిందీ కూడా నేర్చుకున్నారు. 2012లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఏకంగా 182 మంది ఐఎఎస్‌లకు మహిళా సంఘాలపై శిక్షణ ఇచ్చారు. సంఘాల స్థాపన, వాటి ద్వారా మహిళలు ఎలా ఆర్థికాభివృద్ధి సాధించారనే దానిపై కేస్ స్టడీలతో సహా శిక్షణ ఇచ్చి ఔరా అన్పించారు. వరి, వేరుశనగలో వినూత్న పద్ధతుల ద్వారా మేలైన దిగుబడులు సాధించడంతో పాటు పాడి ఉత్పత్తిలోనూ ప్రగతి సాధించినందుకు కృషి విజ్ఞాన కేంద్రం 2013లో మల్లమ్మను మహిళా ఆదర్శ రైతుగా ఎంపిక చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement