
అండగా ఉంటా..
గుంటూరు నగరాన్ని అందంగా...ఆహ్లాదంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉంటుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలోనూ వారి శ్రమ గుర్తించదగినదే..
గుంటూరు నగరాన్ని అందంగా...ఆహ్లాదంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉంటుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలోనూ వారి శ్రమ గుర్తించదగినదే...వారంతా ఒక్కరోజు పనులకు బ్రేక్ ఇస్తే నగర సొగసు ఊహించలేం...క్షణం కూడా నగర గాలి పీల్చలేం. రోడ్లు, వీధులు, చివరకు ఇళ్ల ముందు సైతం పెట్టని కోటల్లా చెత్తా చెదారం టన్నులకొద్దీ పేరుకుపోయి దుర్గంధం దిగంతాలను తాకుతుంది.
నిత్యం చెత్త ఎత్తుతూ, డ్రైనేజీలను శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి' సంకల్పించింది. వారి పరిస్థితిని ప్రజల మనిషిగా, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి బాగా అర్థమవుతోంది. అందుకే ‘సాక్షి' తన సంకల్పాన్ని సాకారం చేసే బాధ్యతను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాకు అప్పగించింది.
‘వీఐపీ రిపోర్టర్’గా గుంటూరులోని పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీయించింది. రిపోర్టర్గా ఎమ్మెల్యే ఈ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వారు నివసించే ఆనందపేట రెండవ లైన్కు వెళ్లారు. కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాధలు సావధానంగా విన్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పారిశుద్ధ్య కార్మికులు ఉంటున్న ఆనందపేటలో కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు కృషి చేస్తా. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి యూనిఫాం, సబ్బులు, కొబ్బరినూనె, బూట్లు ఇప్పించేలా చర్యలు చేపడతా. ఇంటి పన్నులు కట్టించుకుని కుళాయి వేయించేలా కృషి చేస్తా. కాలనీలో మౌలిక సదుపా యాలను కల్పిస్తా. కార్మికులకు ప్రమాద బీమా అందించేందుకు చర్యలు చేపడతా. కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యల కోసం పోరాడతా.
- ఎమ్మెల్యే ముస్తఫా
మొహమ్మద్ ముస్తఫా : నమస్తే, నా పేరు షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేని. మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా? ఏంటి మీ సమస్యలు ?
వెంకటరమణ : నమస్కారం సారూ... మేము ఊరంతా శుభ్రం చేస్తున్నా.. మా కాలనీలను పట్టించుకునే వారే లేరు. కనీస సౌకర్యాలు లేవు. ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలు చేసేందుకు జాగా కూడా లేదు. కనీసం మీరైనా స్పందించి మా సమస్యలు తీర్చండి సారూ..
నూకమ్మ : అయ్యా.. ఎప్పటి నుంచో ఈ కాలనీలో ఉంటున్నాం. ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. కనీసం పన్ను కూడా కట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ క్వార్టర్స్లోనే ఉంటున్నాం. అవికూడా బాగోలేదు. కనీసం మరుగుదొడ్లు లేవు. శుభకార్యాల కోసం మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించండయ్యా...
మొహమ్మద్ ముస్తఫా : జీతాలు వస్తున్నాయా?
దుర్గాభవాని : నెలంతా కష్టపడితే రూ. 6 వేలు వస్తాయి. సెలవు పెడితే కోత పెడుతున్నారు. అవి కూడా సక్రమంగా రావడంలేదు. నెల దాటి 20 రోజులు గడిస్తేగానీ జీతం రావడంలేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
మొహమ్మద్ ముస్తఫా: మీకు ఈఎస్ఐ కార్డులు జారీ చేశారా..?
వైద్య సేవలు అందుతున్నాయా ?
సత్యవతి: కార్డులు ఇంతవరకూ ఇవ్వలేదు. కార్డులే లేకుండా వైద్యం ఎట్లా..మా జీవితాలు దుర్భరంగా మారాయి. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
మొహమ్మద్ ముస్తఫా : యూనిఫాం, స్టేషనరీ ఇస్తున్నారా ?
బంగారు పార్వతి : కార్పొరేషన్ అధికారులు మా సమస్యలు పట్టించుకోవడం లేదు.
యూనిఫాం మూడేళ్లుగా ఇవ్వలేదు. మురుగు కాల్వల్లో చెప్పులు లేకుండా దిగితే మే కులు దిగి సెప్టిక్అవుతుంది. బూట్లు మాటే ఎత్తడం లేదు.
మొహమ్మద్ ముస్తఫా : కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీపై అధికారులు ఏమంటున్నారు?
బండి దుర్గమ్మ : ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు, అధికారులు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామంటున్నారు. ఎవరూ ఏమీ చేయడం లేదు. 14 ఏళ్లుగా కాంట్రాక్టు పైనే ఉన్నాం.
మొహమ్మద్ ముస్తఫా ః మీకు ఇవ్వాల్సిన వస్తువులను కార్పొరేషన్ అధికారులు అందిస్తున్నారా?
భజంత్రీ ఈశ్వరమ్మ : రోజూ మురుగులో తిరిగే మాకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, వంటివి అందించాలి సార్..కానీ అధికారులు ఏ ఒక్కటీ ఇవ్వడం లేదు. మా జీతం డబ్బుతో మేమే కొనుక్కుంటున్నాం. ఎప్పుడో ఎంఎం నాయక్ కమిషనర్గా ఉన్నప్పుడు బట్టలు, చెప్పులు, కొబ్బరినూనె ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లు మా గోడు పట్టించుకోవడం లేదు.
మొహమ్మద్ ముస్తఫా : మీ సమస్యలు కమిషన్కు చెప్పారా?
రౌతు వెంకటరమణ : మేడమ్ గారితో నేరుగా మాట్లాడలేదు. మా యూనియన్ నాయకులు ఆమెతో అనేక సార్లు సమస్యల గురించి చెప్పినా తిరిగి ఏమీ చెప్పలేదు. జీతాలు పెంచాలని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. ఇంత వరకూ పర్మనెంట్ చేయలేదు.
మొహమ్మద్ ముస్తఫా : కార్పొరేషన్ తరఫున మీకు ప్రమాద బీమా కల్పించారా..?
అరుణకుమారి : అసలు అదంటే ఏమిటో కూడా మాకు తెలియదయ్యా. అధికారులకు మాగోడు పట్టదయ్యా. అసలు మాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. మా కనీస అవసరాలైనా తీర్చేలా చూడండి. ఎవరికైనా ప్రమాదం జరిగితే పట్టించుకోరు. అసలు అధికారులు ఎవరూ రారు.
మొహమ్మద్ ముస్తఫా : మీ పిల్లల సంక్షేమానికి కార్పొరేషన్ ఏమైనా చేస్తోందా?
శ్రీను : అధికారులకు మా గురించే పట్టించుకునే తీరిక లేదు. ఇక మా పిల్లల సంక్షేమం గురించి వాళ్లేం చేత్తారయ్యా..
మొహమ్మద్ ముస్తఫా : వీరి జీవితాలు ఏం చేస్తే బాగుపడతాయో కార్మిక నాయకుడిగా మీరు చెప్పగలరా..?
కార్మిక నాయకుడు రవి: జీతాలు పెంచుతామని హామీలు ఇవ్వడం తప్ప అధికారులు వీరి గురించి పట్టించుకోవడం లేదు. పారిశుధ్య కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పించడం ద్వారా వారి జీవన విధానంలో మార్పు తేవచ్చు. నగరంలో 12 కాలనీల్లో పారిశుధ్య కార్మికులు జీవిస్తున్నారు. వీరికి పక్కా ఇళ్ళు కట్టించాలి. కాలనీల్లో రోడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలి. ఎస్సీల కాలనీలపై అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు.
కార్మికుడి ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే... భజంత్రి సాంబశివరావు అనే కార్మికుడి ఇంట్లోకి ఎమ్మెల్యే ముస్తఫా వెళ్లి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇంత చిన్న ఇంట్లో ఎంత మంది ఉం టున్నారని వారిని ప్రశ్నించారు. సాంబశివరావు మాట్లాడుతూ ‘ఈ ఇంట్లో ఆరుగురుం ఉంటున్నాం సార్. పెపైచ్చులు ఊడిపోయాయి.’
వర్షం వస్తే ఎలా అని ఎమ్మెల్యే ప్రశ్నించగా ‘వర్షాకాలంలో ఎక్కడో ఓ చోట తలదాచుకోవడమేనని, మొత్తం మూడు కుటుంబాలు ఈ ఇంట్లోనే ఉంటున్నా’యని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇప్పించి ఆదుకోవాలని,పిల్లలను బడికి కూడా పంపలేకపోతున్నామన్నారు. మీ కష్టాలు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తామని ముస్తఫా హామీ ఇచ్చి వెనుదిరిగారు.
ట్రాన్స్కో డీఈకి ఫోన్... ఆనందపేటలోని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు ఇవ్వకపోవడం గురించి ఎమ్మెల్యే ముస్తఫా ట్రాన్స్కో డీఈ విజయ్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన డీఈ ఆనందపేటలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అక్కడి నుంచి ఆనందపేట మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించాలని కోరారు. మరుగుదొడ్లు సక్రమంగా లేవని తెలిపారు.
కమిషనర్కు ప్రజల సమస్యలు పట్టడం లేదు
గుంటూరు నగరపాలక సంస్థ ఐఏఎస్ అధికారుల పాలనలో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఉన్న కమిషనర్కు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. తాను 150 డస్ట్బిన్లు కొనుగోలు చేసి కార్పొరేషన్కు అప్పగిస్తే వాటినీ పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు మేలు చేసిన ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, మల్లిఖార్జున నాయక్ల పేర్లు గుర్తున్నాయంటే వారి పనితీరే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
ప్రజెంటేషన్ :
నక్కా మాధవరెడ్డి
ఫొటోలు: రూబెన్