ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
దేవీపట్నం(తూ.గో): గోదావరి ఎగువన తగ్గుతూ.. దిగువన పెరుగుతుండటంతో ఇంకా కోనసీమ లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దేవీపట్నం మండలం దండంగి వద్ద కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాలైన చింతూరు, వి.ఆర్.పురంలో ముంపుతీవ్రత కొనసాగుతోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్వేలపై ముంపుతీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పడవలను అందుబాటులో ఉంచారు.
మరొకవైపు విలీన మండలాల్లో రెండో రోజు కలెక్టర్ కార్తీకేయ మిశ్రా తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బాధితులకు నిత్యావసర సరకులు అందిస్తున్నామన్నారు. అక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.