
సాక్షి, అమరావతి : కనిగిరిలో అత్యాచారయత్నానికి గురైన యువతితో పాటు ఆమె తల్లిదండ్రుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, సీఎం చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకువచ్చారు. సీఎంతో ఈ విషయంపై చర్చించిన అనంతరం విలేకరులతో రాజకుమారి మాట్లాడుతూ.. ఇటీవల కనిగిరిలో జరిగిన ఘటన ఈ దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ముగ్గురు అబ్బాయిలు ఈ అత్యాచార చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ సంఘటన మూలాల సేకరణకై సీఎం ఆదేశించారని తెలిపారు.
పథకం ప్రకారమే ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం చేశారని వెల్లడించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఘటనకు కారణమైన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. బాధితురాలు చదువుకునేలా పూర్తి ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రూ.10 లక్షలు బ్యాంక్ డిపాజిట్, ఒక ఇల్లు, బాధితురాలు సహా ఆమె తమ్ముడి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చెయ్యాలన్నారు.