కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్ | industrial hub in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్

Jul 25 2014 3:37 AM | Updated on Sep 2 2017 10:49 AM

కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.

కర్నూలు : కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో కలిసి గురువారం ఏపీఎస్పీ క్యాంప్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సారిగా కర్నూలులో జాతీయజెండా ఎగురవేయడం సంతోషకర విషయమన్నారు.  కర్నూలుకు ఏదో ఒక మంచి ప్రాజెక్టు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.  జిల్లాలో సంపూర్ణమైన ముడి సరుకు, పుష్కలంగా నీరు, విస్తారమైన ప్రభుత్వ భూమి ఉన్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు.

 హెదరాబాద్ స్థాయిలో కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.  మన ప్రాంతంలో ప్రస్తుతం సిమెంటు కర్మాగారాలు, పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటుకు విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. కర్నూలు నగరంలో ఆటో నగర్, భారీ వాహనాల పార్కి ంగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయింపునకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజధాని ఏర్పాటు కోసం కర్నూలుతో పాటు అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్మాణం జరుగుతుందన్నారు. చెన్నై-ముంబయి వంటి ప్రాంతాలు ఒక మూలకు ఉన్నప్పటికీ అవి రాజధానిగా చలామణి అవుతున్నాయని కేఈ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement