ఇందిర జలభ్రమ! | Indira Jalaprabha remain a dream for the state | Sakshi
Sakshi News home page

ఇందిర జలభ్రమ!

Oct 23 2013 2:53 AM | Updated on Sep 1 2017 11:52 PM

ఇందిర జలభ్రమ!

ఇందిర జలభ్రమ!

లక్ష బోర్లు వేయడంతోపాటు వాటికి మోటార్లు, పంపులు, స్టార్టర్లు, ఇతర ఉపకరణాలు అమర్చి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పథకం కింద బోర్లకు అనుమతులు, టెండర్లతోనే పుణ్యకాలం పూర్తి
  లక్ష బోర్లకుగానూ సిద్ధమైనవి 2,500 మాత్రమే
  తాజాగా 16 వేల పంపులు, మోటార్లకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
  లక్ష బోర్లు, 10 లక్షల ఎకరాలు సేద్యంలోకి తేవాలన్నది లక్ష్యం
  పథకం ప్రారంభమై రెండేళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
  ఇదే తీరు కొనసాగితే 2015 నాటికి లక్ష్యం పూర్తి అసాధ్యమే
 
బలహీన వర్గాలకు చెందిన పేద రైతుల భూములను సస్యశ్యామలం చేస్తామంటూ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఇందిర జలప్రభ’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు వదలటంతో కలగానే మిగులుతోంది! లక్ష బోర్లు వేసి 10 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని చెప్పి 2,500 బోర్లతో సరిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మహర్దశ అంటూ ప్రచారంతో హడావుడి చేసి ఇప్పుడా విషయాన్నే మరిచింది. నిధుల లేమితో పథకం ముందుకు సాగడం లేదు. 2011 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఇందిర జలప్రభ పథకానికి రెండేళ్లు దాటిన తరువాత ఇప్పుడు తాపీగా బోర్ మోటార్లు, పంపులు, ఇతర పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
 
 పూర్తిగా సిద్ధమైనవి 2,536 బోర్లే
రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో అమల్లోకి తెచ్చిన ఇందిర జలప్రభ పథకం కింద 16,669 బోరు మోటార్లు, ఇతర ఉపకరణాల కొనుగోలుకు గ్రామీణాభివృద్ధి శాఖ టెండర్లు పిలిచింది. టెండర్ల సాంకేతిక బిడ్స్(టెక్నికల్ బిడ్)ను వాయిదా వేసిన అధికారులు అక్టోబర్ ఒకటో తేదీన వీటిని తెరవనున్నట్లు పేర్కొన్నారు. లక్ష బోర్లతో పది లక్షల ఎకరాలను సాగులోకి తేవటం పథకం ప్రధాన లక్ష్యం. ముగ్గురు నలుగురు రైతులను కలిపి ఒక గ్రూపు కింద బోరు వేసి ఆరుతడి పంటలు పండించుకునే అవకాశం కల్పించటం దీని ఉద్దేశం. రెండేళ్ల నుంచి బోర్లు, పంపులు, మోటర్ల కొనుగోలుకు ఏ పద్ధతి అనుసరించాలన్న అంశంపైనే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. 
 
ఎట్టకేలకు జిల్లాల వారీగా ఈ ఆర్థిక సంవత్సరంలో మోటార్లు, పంపులు, పరికరాల సరఫరాతోపాటు నాలుగేళ్లు బోర్ల నిర్వహణ బాధ్యతను సదరు కంపెనీలే చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు టెండర్‌లో నిబంధన విధించారు. మోటార్లు, పంపులు, సంబంధిత పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థలు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అధీకృత డీలర్లు కూడా పాల్గొనవచ్చన్న నిబంధ నను ఈసారి మార్చారు. 
 
లక్ష బోర్లు వేయడంతోపాటు వాటికి మోటార్లు, పంపులు, స్టార్టర్లు, ఇతర ఉపకరణాలు అమర్చి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు 24,000 బోర్లకు సంబంధించిన అంచనాలు రూపొందించగా అందులో 21 వేల బోర్లు వేయడానికి అనుమతినిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిల్లో 16 వేల బోర్లకు సంబంధించి పనులు ప్రారంభం కాగా 12,338 బోర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు పూర్తిగా సిద్ధమైనవి 2,536 బోర్లు మాత్రమేనని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. 2015 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా అది అసాధ్యమని వీటి పనులు జరుగుతున్న తీరే స్పష్టం చేస్తోంది. 
 
 సబ్‌మెర్సిబుల్ పంపులు, 
 మోటార్ల కొనుగోలు టెండర్లు (జిల్లాల వారీగా) 
 ఆదిలాబాద్  1667, అనంతపురం 1000, చిత్తూరు 833, తూర్పుగోదావరి 467, గుంటూరు 275, కడప 417, కరీంనగర్ 517, ఖమ్మం 1417, కృష్ణా 225, కర్నూలు 900, మహబూబ్‌నగర్ 1517, మెదక్ 1250, నల్లగొండ 1083, నిజామాబాద్ 483, ప్రకాశం 467, రంగారెడ్డి 475, నెల్లూరు 417, శ్రీకాకుళం 667, విశాఖపట్టణం 1167, విజయనగరం 667, వరంగల్ 550, పశ్చిమ గోదావరి 208...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement