అక్రమ చెరువుల తవ్వకాలపై కొరడా


భీమవరం, న్యూస్‌లైన్ : అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్న వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతరం జరిమానాతో పాటు చెరువులు ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వి సాగుచేస్తున్న వారిని గుర్తించే పనిలో మత్స్య, రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల అక్రమసాగు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చెరువుల రైతులందరికి ముందుగా నోటీసులు జారీ చేసే కార్యక్రమం ప్రారంభించారు. కొత్తగా ఎటువంటి అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వుతున్న వారిని గుర్తించి చెరువులకు గండికొట్టడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నారు. రెండు రోజులుగా కాళ్ల, పెనుమంట్ర, గణపవరం మండలాల్లో అక్రమ చెరువుల తవ్వకాలపై అధికారులు దాడులు చేసి పొక్లెన్‌లను స్వాధీనం చేసుకుని తవ్వకందారులపై క్రిమినల్ కేసులు పెట్టారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వకూడదని ఇప్పటికే అధికారులు టాంటాంలు వేయిం చారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

 

 ముందుగా నోటీసులు, జరిమానా..

 జిల్లాలోని అక్రమ చేపల చెరువుల భరతం ప ట్టేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్వర్యంలో అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. ముం దుగా నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతరం ఎకరానికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. నిబంధనలను పాటించకుండా చెరువులు సాగు చేస్తున్నారన్న దానిపై ముందు జరిమానా విధించి ఆ తర్వాత చెరువులకు గండి కొట్టి ధ్వంసం చేయనున్నట్టు మత్స్యశాఖ భీమవరం ఉప సంచాలకులు లాల్ మహ్మద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దశగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కాళ్ల, భీమవరం, మొగల్తూరు, ఆకివీడు, నర్సాపురం మండలాల్లో అత్యధికంగా అనధికారికంగా చెరువులు సాగు చేస్తున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా సాగవుతున్న చెరువులకు అధికారులు దరఖాస్తుచేసుకునేందుకు గతేడాది జూన్ 15 వరకు అవకాశం ఇచ్చారు. కొంతమంది ఈ సమయంలో రెన్యువల్ చేయించుకున్నారు. ఇక అవకాశం లేదని అధికారులు తెలిపారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top