తిరుమలలో వేసవి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుతున్నాయి.
తిరుమల : తిరుమలలో వేసవి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలను దాటింది. మే మొదటి వారంలోనే ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఉక్కపోత పెరగడంతో భక్తులు తల్లడిల్లిపోయారు.
ఆలయ ప్రాంతంలో పాద రక్షలు నిషేధం. స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు నేల సలసలా కాలుతుండడంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎండ నుంచి రక్షణకు భక్తులు టోపీలు, గొడుగులు, వస్త్రాలు అడ్డుపెట్టుకోవడం కనిపించింది. కాగా భక్తుల కష్టాలు గుర్తించిన టీటీడీ ఉపశమన చర్యలు ప్రారంభించింది. చలువ పందిళ్లు నిర్మించడంతోపాటు నేలపై కూల్ పెయింట్ వేస్తోంది. ఎర్ర తివాచీ పరిచి దానిపై నీటిని చల్లే ఏర్పాట్లు చేసింది.