తగ్గిన ‘హై సెక్యూరిటీ’ | high security decreased | Sakshi
Sakshi News home page

తగ్గిన ‘హై సెక్యూరిటీ’

Aug 27 2014 3:56 AM | Updated on Sep 2 2017 12:29 PM

‘హై సెక్యూరిటీ’ నంబర్ ప్లేట్లకు ఆదరణ తగ్గుతోంది. రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ విధానం సక్రమంగా అమలు కావడంలేదు.

మర్రిపాలెం : ‘హై సెక్యూరిటీ’ నంబర్ ప్లేట్లకు ఆదరణ త గ్గుతోంది. రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ విధానం సక్రమంగా అమలు కావడంలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డులు తప్పక అమర్చాలన్న ఆదేశాలను వాహనచోదకులు పట్టించు కోవడంలేదు. సంబంధిత అధికారులు కూడా శ్రద్ధ చూపకపోవడంతో హై సెక్యూరిటీ విధానం నిర్లక్ష్యానికి గురవుతోంది.

 కానరాని నాణ్యత ప్రమాణాలు
 గతేడాది డిసెంబర్ 11 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డుల ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి వాహనాలకు బోర్డులు అమర్చడం జరుగుతోంది. బోర్డుల నాణ్యత పాటించకపోవడంతో వాహనచోదకులు రవాణా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోర్డుల తయారీ సంస్థ ‘లింక్ ఆటో టెక్’కు అధికారులకు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అయినా మార్పు లేకపోవడంతో యజమానులు కొనుగోలు చేయడం తగ్గించారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర ్శలు వినిపిస్తున్నాయి.

 తగ్గిన డిమాండ్
 కొత్త రిజిస్ట్రేషన్ వాహనాలన్నీ దాదాపు స్టిక్కరింగ్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ‘హై సెక్యూరిటీ’లో లోపాలు సాకుగా చూపించి యజమానులు సామాన్య బోర్డులు అతికిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో బోర్డులకు ఆయా సంస్థలు ఐదేళ్ల వారంటీని ప్రకటిస్తున్నా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ‘హై సెక్యూరిటీ’ బోర్డుల బుకింగ్‌లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నెలకు నాలుగు వేలకు పైగా టూ వీలర్స్ రిజిస్ట్రేషన్‌లు కాగా దాదాపు వెయ్యి బోర్డులకు బుకింగ్ ఉంటోంది. కేవలం 10 శాతం మంది మాత్రమే కార్లకు ‘హై సెక్యూరిటీ’ బోర్డులు కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement