గుబ్బల మంగమ్మ గుడి మనదే | Gubbala Mangamma Talli Temple in AP | Sakshi
Sakshi News home page

గుబ్బల మంగమ్మ గుడి మనదే

Dec 19 2014 1:43 AM | Updated on Sep 2 2017 6:23 PM

గుబ్బల మంగమ్మ గుడి మనదే

గుబ్బల మంగమ్మ గుడి మనదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన గుబ్బలమంగమ్మ ఆలయం భౌగోళికంగా పశ్చిమగోదావరి జిల్లా

బుట్టాయగూడెం/అశ్వారావుపేట : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన గుబ్బలమంగమ్మ ఆలయం భౌగోళికంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉందని తేలింది. కొండరెడ్ల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ ఆలయం వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డీఎఫ్‌వోలు, ఆర్డీవోలు గురువారం ఉమ్మడిగా విచారణ నిర్వహించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి అటవీ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయం నిర్వహణపై రెండు నెలలుగా వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్య విచారణ చేపట్టి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, సరిహద్దులను గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు ఆలయాన్ని ఏ ప్రాంతానికి చెందిన వారు నిర్వహించారో.. వస్తున్న ఆదాయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారో తదితర విషయాలను ఆరా తీశారు.
 
 అన ంతరం అటవీ శాఖ వద్ద ఉన్న సరిహద్దు మ్యాప్‌లను, ఆలయం పరిసరాల్లోని  హద్దు రాళ్లను పరిశీలించారు. కొండరెడ్లు, గిరిజనులకు మాత్రమే అడవిపై హక్కులు ఉండగా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజనేతరులు వారి స్వలాభాల కోసం వివాదాలు సృష్టించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొండరెడ్లను రెచ్చగొట్టడం వల్లే వివాదం ఏర్పడిందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని కొండరెడ్లు, గిరిజనులతో మాట్లాడి పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పది రోజుల సమయం కావాలని పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఆర్.వి.సత్యనారాయణ కోరడంతో విచారణ వాయిదా పడింది. ఏలూరు డీఎఫ్‌వో రామ్మోహన్‌రావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో మురళీ మోహన్‌రావు, ఏడీ పీవీ సత్యనారాయణ, డీఈఈ రాంగోపాల్‌రావు, బుట్టాయిగూడెం తహసిల్దార్ ఆసీఫా తదితరులు పాల్గొన్నారు.
 
 నిగ్గు తేల్చిన సర్వే
 ఈ సందర్భంగా ఖమ్మం, పశ్చిమ గోదావరి జల్లాలకు చెందిన అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వేసిన రాళ్లను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా పరిశీలించారు.  ఈ సర్వేలో సరిహద్దు ప్రాంతం నుంచి 15 మీటర్ల లోపలికి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉందని సర్వే అధికారులు నిర్ధారించారు. పశ్చిమగోదావరి జిల్లాకే చెందుతుందని పేర్కొ న్నారు.    ఆలయానికి వెళ్లే రహదారిలో కొంత భాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలోను, మరికొంత భాగం తెలంగాణ పరిధిలోను ఉందని నిర్ధారించారు.
 
 గిరిజనుల ధర్నా
 ఆలయూనికి వచ్చే భక్తుల నుంచి ఖమ్మం జిల్లా అటవీ శాఖ సిబ్బంది టోల్‌గేటు ఫీజు వసూలు చేస్తున్నారని, వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీకి చెందిన నాయకులు ఉద్దండ ఏసుబాబు, కారం వాసు, కోర్స కన్నప్పరాజు ఆధ్వర్యంలో గిరిజనులు అధికారులను అడ్డుకుని ధరా్నా నిర్వహించారు. ఈ అంశంపై ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవో డి.దివ్య , పాల్వంచ డీఎఫ్‌వో శ్రీనివాస్, పశ్చిమగోదావరి ఐటీడీఏ పీవో సూర్యనారాయణ చర్చలు జరిపి టోల్‌గేట్‌ను తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement