బంగారు కల

Golden dream - Sakshi

బంగారు పీర్ల కోసం బావిలో నీళ్లు తోడుతున్న గ్రామస్తులు

కొలిమిగుండ్ల:  బంగారంతో తయారు చేసిన పీర్లు బావిలో ఉన్నట్లు ఓ యువకుడికి తరచూ కల వస్తుండటంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఒకవేళ అది నిజం కావచ్చేమోనని గ్రామస్తులు బావిలో నీరు తోడుతున్నారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో పురాతన బావి ఉంది. అందులో బంగారంతో చేసిన చిన్నకాశీం, పెద్ద కాశీం, దస్తగిరిస్వామి పీర్లు ఉన్నాయని గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తరచూ కల వస్తోందట! ఆలయం వెనుక భాగంలో వందల ఏళ్ల క్రితం పాత ఊరు (కొత్తకోట అనే గ్రామం) ఉండేది.

అక్కడే ఈ పురాతన బావి ఉండటంతో ఆ యువకుడికి వచ్చిన కల నిజం కావచ్చేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి బావి వద్దకు చేరి పీర్ల కోసం అన్వేషిస్తున్నారు. మూడు రోజుల పాటు వరుసగా రాత్రి, పగలూ బావిలోకి దిగి శతవిధాలా ప్రయత్నం చేశారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా డీజిల్‌ ఇంజిన్‌ సాయంతో పంపింగ్‌ చేస్తున్నారు. బావిలో ఊట కారణంగా నీళ్లు తగ్గుముఖం పట్టడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top