కిరణ కరుణ లేదు

తొలిరోజు ఆదిత్యుడిని తాకని సూర్యకిరణాలు

మబ్బులు కమ్మేయడంతో నిరాశ చెందిన భక్తులు

నేడు, రేపు కిరణ దర్శనానికి అవకాశం ఉందంటున్న ఆలయ వర్గాలు  

శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడిని తొలి సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూడాలని ఆశ పడిన భక్తులకు నిరాశ తప్పలేదు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చిన కాలమార్పుల్లో భాగంగా కన్పించే తొలికిరణ అద్భుత దృశ్యం ఆదివారం

ఆలయ రాజగోపురం వద్ద మబ్బులు కమ్మిన దృశ్యం కనిపించలేదు. ఏటా మార్చి, అక్టోబర్‌ నెలల్లో తొలి సూర్యకిరణాలు నేరుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును స్పృశిస్తుంటాయి. ఆదివారం ఉదయం మబ్బులు కమ్మేయడంతో ఈ దృశ్యం కనిపించలేదు. భక్తుల కోసం ఆలయ ఈఓ శ్యామలాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు కిరణ దర్శన ప్రాప్తి కలుగలేదు.  

నేడు, రేపు కూడా అవకాశం
ఏటా మార్చి 8, 9, 10 తేదీలతో పాటు అక్టోబర్‌ 1,2,3 తేదీల్లో తొలి సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. తూర్పు దిశ నుంచి తొలి కిరణాలు ఆలయ రాజ గోపురం మధ్య నుంచి అనివెట్టి మండపం గుండా ధ్వజ స్తంభాన్ని తాకుతూ నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్‌ పాదాలపై పడి అలాగే స్వామి వారి ముఖం వరకు కిరణ స్పర్శ కనిపిస్తుంది.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆదివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆకాశం మేఘావృతం కావడంతో తొలిరోజు మబ్బులు సూర్య కిరణాలను తాత్కాలికంగా అడ్డుకున్నాయి. దీంతో సూర్యోదయ సమయంలో సుమారు ఐదారు నిమిషాలు వరకు కనిపించే ఈ దృశ్యం ఈ మారు కన్పించలేదు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ దృశ్యం చూసేందుకు అవకాశముందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top