మంగళగిరిలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన
కలగానే సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి
Dec 27 2013 2:07 AM | Updated on Jul 7 2018 2:56 PM
మంగళగిరి, న్యూస్లైన్ :మంగళగిరిలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నేటి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రులు కె. రోశయ్య, ఎన్. కిరణ్కుమార్రెడ్డి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు సీఎం షేషీకి పరిమితమయ్యాయి. మంగళగిరిలోనే సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయిస్తామని జిల్లా ప్రజప్రతినిధులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చకపోవడంతోనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య వున్న మంగళగిరి టీబీ శానిటోరియం ప్రాంతంలో కోస్తా జిల్లాల ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వున్నాయి. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళగిరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళగిరి టీబీ శానిటోరియం ప్రాంగణంలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
ఆయన మరణానంతరం దీనిపై ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఓ కేంద్ర మంత్రి వున్నా ఉపయోగం లేకుండాపోయింది. ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. మంగళగిరి, ఆత్మకూరు పరిధిలో 214 ఎకరాల సువిశాలమైన భూమి ఉంది. కాలుష్యరహితంగా రెండు కొండల నడుమ పచ్చదనంతో కళకళలాడుతూ ఉండే వాతావరణంలో 1962లో టీబీ శానిటోరియం ఏర్పాటు చేశారు. 1972లో 50 ఎకరాలను ఏపీఎస్పీ 6వ బెటాలియన్కు కేటాయించారు. మరో 50 ఎకరాలను 2011లో రాష్ట్రంలోనే ప్రపథమంగా ఏర్పాటు చేసిన 10వ జాతీయ ప్రకృతి విపత్తుల సహాయ దళానికి కేటాయించారు. అదే ఏడాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సెన్సైస్ రీసెర్చ్ అకాడమీ క్యాంపస్కు 75 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమి ఖాళీగా వుంది. దీనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 30 నుంచి 40 ఎకరాల వరకు భూమి అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీబీ శానిటోరియం ప్రాంగణం సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి అనుకూలంగా వుంటుందని గత ఏడాది శాసనమండలి హామీల అమలు కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది.
అయితే దీనిపై ఇప్పటివరకు ఏ విధమైన ఆదేశాలు జారీ కాలేదు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు కూడా అప్పట్లోనే శానిటోరియం ప్రాంగణాన్ని పరిశీలించి వెళ్లారు. ఇదిలావుండగా, విజయవాడ ప్రాంతంలోనే సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, సీఎం కిరణ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయిస్తామని అక్కడి నేతలు గతంలో ప్రకటించారు. దీనిపై వివాదం జరగడంతో శంకుస్థాపన పనులు నిలిచి పోయాయి. రైలు, రోడ్డు రవాణాతో పాటు విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ వున్న జాతీయ రహదారి పక్కనే టీబీ శానిటోరియం ప్రాంగణం వుండటం కూడా ఆసుపత్రి ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా వుంటుందని భావిస్తున్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండే విధంగా సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళగిరిలో ఏర్పాటు చేయించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు పోరాడతారో లేక విజయవాడ కు అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement