క్లుప్తంగా
విద్యార్థినికి లైంగిక వేధింపులు ● పోక్సో చట్టం కింద టైలర్ అరెస్టు
తిరువొత్తియూరు: పాఠశాల విద్యార్థినిని లైంగికంగా వేధించిన టైలర్పై పోలీసులు పోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఉద్యోగికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కాగా అదే ప్రాంతంలో జయకుమార్ (48) టైలర్ ఉన్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని కొన్ని రోజుల క్రితం అదే వీధిలో ఆడుకుంటున్న సమయంలో అక్కడ విద్యార్థినికి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆ విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి బాలికను లైంగిక వేధించాడు. దిగ్బ్రాంతి చెందిన విద్యార్థిని ఏడుస్తూ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు గుడియాత్తం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ అల్లిరాణి పోక్సో చట్టం కింద టైలర్ జయకుమార్ను సోమవారం ఉదయం అరెస్టు చేశారు.
పీహెచ్సీ నర్స్కు.. ● ప్రభుత్వ డాక్టర్ అరెస్టు
తిరువొత్తియూరు: వత్తలగుండు సమీపంలో నర్సును లైంగికంగా వేధించిన ప్రభుత్వ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. దిండుకల్లు జిల్లా వత్తులగుండు సమీపంలో మల్లంపట్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆస్పత్రిలో శ్రీనివాసన్ (28) వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఇతను అక్కడ పనిచేస్తున్న నర్స్ (31)ని లైంగికంగా వేధించాడు. దీంతో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. బంధువులు ఆమెను చికిత్స కోసం దిండుకల్లు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఇందుకు సంబంధించి నర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాసన్ను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.
పోలీసులను బెదిరించిన వ్యక్తి అరెస్టు తిరువొత్తియూరు: పోలీసులకు కత్తి చూపి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లా తిరువోనం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులు భాస్కర్, రామమూర్తి, తిరువోనం సమీపంలో పుదువిడిది ప్రాంతంలో రాత్రి వేళ గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో పుదువిడిది గ్రామానికి చెందిన శరవణన్ కుమారులు సూర్య ప్రకాష్ (25), మణికంఠన్ (23) పోలీసులను అడ్డుకుని కత్తి చూపి, తమ అనుమతి లేకుండా గ్రామంలోకి ఎలా వచ్చారని బెదిరించారు. దీంతో తిరువోనం పోలీస్ స్టేషన్కు వెళ్లిన పోలీసులు దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులకు కత్తిని చూపించి బెదిరించిన సహోదరులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సూర్యప్రకాష్ అరెస్టు చేశారు. తప్పించుకొని పారిపోయిన మణికంఠన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైలు కింద పడి విద్యార్థి మృతి తిరువొత్తియూరు: చైన్నె ఎన్నూర్ రైల్వేస్టేషన్ వద్ద రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నంచిన కళాశాల విద్యార్థిని రైలు కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చైన్నె ఎన్నూరు కామరాజర్నగర్ మొదటి వీధికి చెందిన మహమ్మద్ నాజర్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. ఇతని కుమార్తె మహమ్మద్ నబిల్ (17) ఈఏడాది ప్లస్టూ పరీక్ష పాసైంది. ఆమె ఆవడిలో ఉన్న ఒక ప్రైవేటు కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు తీసుకురావడానికి కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి సోమవారం ఉదయం కళాశాలకు బయలుదేరింది. ఇంటికి నుంచి వెళ్లిన విద్యార్థి అక్కడ టికెట్ తీసుకుని అదే సమయంలో వచ్చిన విద్యుత్ రైలు ఎక్కింది. అయితే ఆ రైలు తిరువళ్లూరుకు వెళ్లదని, చైన్నె సెంట్రల్కు వెళుతుందని తెలియడంతో విద్యార్థి హడావుడిగా రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించింది. అప్పుడు అకస్మాత్తుగా కాలుజారి కింద పడడంతో రైలు ఢీకొని అక్కడిక్కడే విద్యార్థి మృతి చెందింది. సమాచారమందుకున్న కొరుక్కుపేట రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని, మొహమ్మద్ నబిల్ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం చైన్నె స్టాండ్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కార్మికుడి హత్య అన్నానగర్: తిరుచెందూరు సమీపంలోని ఆడైకళాపురంలో సోమవారం భవన నిర్మాణ కార్మికుడిని కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. తిరుచెందూరు తూత్తుకుడి రోడ్డులో ఆడైకలాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. ఈ దుకాణానికి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో ఓ యువకుడిని కొట్టి చంపినట్లు పోలీసులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. తిరుచెందూర్ డీఎస్పీ వసంతరాజ్, తాలూకా పోలీసు ఇన్స్పెక్టర్ సుందరమూర్తి, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుచెందూరు తాలూకా పోలీసులు కంఠసామిపురం గ్రామ నిర్వాకుడు నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో అతడు కీళతేరు ఆళ్వార్ కులమ్ ప్రాంతానికి చెందిన స్వామి కుమారుడు అళగుముముత్తు (33) అని తేలింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కండలేరులో
6.842 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 6.842 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 220 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్ కాలువకు 70 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.