ఐకేపీ అక్రమాల్లో మరో కోణం | Corruption in Indira kranthi patham | Sakshi
Sakshi News home page

ఐకేపీ అక్రమాల్లో మరో కోణం

Aug 31 2015 4:10 PM | Updated on Sep 22 2018 8:22 PM

ఇందిరా క్రాంతిపథంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

కోవూరు(నెల్లూరు) : ఇందిరా క్రాంతిపథంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామంలో కొందరు పొదుపు మహిళల నుంచి ఓ అధికారిణి దాదాపు 5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసిందని ఆ గ్రామ పొదుపు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. కోవూరు ఐకేపీ కార్యాలయంలో సీసీగా పని చేస్తున్న గాజులపల్లి వెంకటసుబ్బమ్మపై పలు ఆరోపణలు వస్తున్నా ఐకేపీ అధికారులు అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే వెంకటసుబ్బమ్మ చేసే అవినీతి అక్రమాల్లో ఐకేపీ అధికారులు కూడా వాటలు ఉన్నాయోమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పోతిరెడ్డిపాళెం గ్రామ పొదుపు మహిళలు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఏ పీడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వున్నారు.

పొదుపు మహిళల కథనం మేరకు.. గాజులపల్లి వెంకటసుబ్బమ్మ గతంలో సీతారామపురం, ఉదయగిరి ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 23 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిందని అప్పటి జిల్లా స్థాయి అధికారులు విధుల నుంచి తొలగించారు. ఎనిమిది మాసాల పాటు విధులకు హాజరు కాకుండా సస్పెన్షన్ లో ఉన్న వెంకటసుబ్బమ్మ అక్క డ నుంచి నేరుగా కోవూరు ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా పద్ధతి మార్చుకోకుండా అదే ఒరవడిని కొనసాగిస్తుంది. ఎవరైనా గ్రూపు సభ్యులు బ్యాంకులకు అప్పులు ఉన్నారన్న విషయం తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్ళి మీ అప్పు మొత్తాన్ని ఒకేసారి రద్దు చేసేందుకు అధికారులతో మాట్లాడుతానని, మొత్తంలో సగం చెల్లిస్తే సరిపోతుందని వారి వద్ద నుంచి సగం మొత్తాన్ని తీసుకొని ఆ నగదును ఎవరకీ  చెల్లించకుండా వెంకటసుబ్బమ్మ తినేస్తూ ఉండేదని మహిళలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నాయకులు అండదండలు...
పొదుపు మహిళలను మోసం చేస్తూ అక్రమంగా వసూళ్ల దందా చేపడుతున్న వెంకటసుబ్బమ్మను ఐకేపీ అధికారులు ఏమీ అనవద్దని టీడీపీ పార్టీకి చెందిన బడా నాయకులు ఐకేపీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో ఐకేపీలో బదిలీల పర్వం ప్రారంభమవుతుందన్న విషయం తెలుసుకొన్న వెంకటసుబ్బమ్మ కోవూరు నుంచి బదిలీ చేయకుండా చూడాలని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుంచి ఐకేపీ అధికారులకు ఫోన్లు చేయించడం జరిగింది. ఐకేపీ అధికారులు కూడా వెంకటసుబ్బమ్మ విషయంలో మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement