ఏం మామా..ఓటు సూసుకున్నావా..! | Sakshi
Sakshi News home page

ఏం మామా..ఓటు సూసుకున్నావా..!

Published Fri, Mar 15 2019 10:40 AM

Conversation Of Villagers About Vote Registration - Sakshi

సాక్షి, కడప : వెంకటయ్య : ఏరా .. సుబ్బయ్య ఈ రోజు ఇంటికాడనే ఉన్నావు. సేనికి పోలేదా..
సుబ్బయ్య : సేనికిపోయి ఏం చేయాలి మామా.. నీళ్లు లేక బోరు ఎండిపాయే. సెన్నిక్కాయ పంటంతా ఎండిపాయగా.. కాలువకేమో నీళ్లు రాలే. ఓట్లప్పుడు నాయకులు వస్తారు, నీళ్లిస్తమంటరు.. తర్వాత ఇక్కడ తొంగిచూడరు.
వెంకటయ్య : అది సర్లే గానీ గోడలకు, స్తంభాలకు కట్టిన బొమ్మలన్నీ ఎట్లా పెరికేస్తున్నారో సూడు. 
సుబ్బయ్య : అద్యా మామా.. ఓట్లు ఉన్నాయి కదా .. రేపు నెల 11న మనము ఓట్లేయాలి. అదిగో మన మాబాషాకైతే రాజకీయాలు బాగా తెలుసు. ఓ మాబాషా ఇట్లరా.. వెంకటయ్య మామ పిల్చుతున్నాడు.
మాబాషా : ఏమబ్బా... మామ, అల్లుళ్లు చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారే. 
వెంకటయ్య : ఏంది లేదు మాబాషా... ఈ సూరి యాయా పార్టీల మధ్య పోటీ ఉంటాది. 
మాబాషా : దీంట్లో చెప్పేదేముంది. మనకుండేది రెండే పార్టీలు. 
వెంకటయ్య : ఈ సారి జగనే ముఖ్యమంత్రి అయితాడని సెపుతున్నారంతా.
రామయ్య : ఏమప్ప (టవల్‌ దింపుకుంటూ వచ్చి) మాబాషా నా అంతా సీనియర్‌ లేడని సెప్పుకొనే చంద్రబాబు జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టినాడు కదా.. ఇదెక్కడి న్యాయం! 
మాబాషా : నువ్వు చెప్పింది నిజమే రామయ్య. ఓటర్లను వెన్నుపోటు పొడిచేందుకు బాబు మళ్లీ ఏందో సేత్తున్నట్లుంది. ఇన్నాళ్లు మనం గుర్తుకు రాలేదు. చంద్రబాబు.. ఎలచ్చన్ల భయంతో అవీ ఇవీ సెబుతున్నాడు. గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అధికార పార్టీ నాయకులు సెప్పిందే సెబుతున్నారు. ఎలచ్చన్లు వచ్చే ముందు నిన్నగాక మొన్న చాన్నా శిలాఫలకాలు వేశారు. భూమిపూజలు చేశారు. 
రామయ్య : మాబాషా ఇంకో మాట.. జన్మభూమి కమిటీలకన్నీ అప్పసెప్పి అసలోళ్లకు ఏ పథకం ఇవ్వకుండా సేశాడు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు సూడి ఈ ప్రభుత్వమంతా మోసమే. 
మాబాషా : నిజమే అసలాయనే బతికుంటే రాష్ట్రమే విడిపోయేది కాదు. మనకిన్ని తిప్పలొచ్చేవి కావు. మంచోళ్లను దేవుడు ముందే తీసుకెళతారంటే ఇదేనేమో..
వెంకటయ్య : అవు మాబాషా చేతిలో కాగితాలతో ఉరికెత్తేది మన యంకట్రెడ్డే గదా.. ఇక్కడికి పిలువు ఓ సారి. 
మాబాషా : ఓ.. యంకట్రెడ్డి.. ఎక్కడికి అట్లా ఉరుకుతున్నావు? 
వెంకటరెడ్డి : (ఆయాసంతో) ఏం చెప్పాలి. ఇప్పటికి ఐదు దఫాలు ప్రతి ఎన్నికలకు వెళ్లి ఓటేసా. ఇప్పుడు లిస్టులో నా ఓటు, నా పెండ్లాం, నా కొడుకు ఓట్లు లేవంటా. ఎవడో కాగితం పెట్టి తీపిచ్చాడంటా. ఇదెక్కడి న్యాయం సూడి. 
సుబ్బయ్య : నీవే కాదు వెంకట్రెడ్డి.. చానా మంది పేర్లు తీసేసేందుకు పెద్దకుట్రే జరిగిందంట.. అందుకే అందరూ మన ఓటు ఉందో లేదోనని ఓటర్ల జాబితాలో సూసుకోవడం మంచిది. ఫారం–6తో మళ్లీ ఓటరు జాబితాలో చేర్చుకునే అవకాశం ఉంది.
వెంకటరెడ్డి : గీ మధ్యనే మా యింటి కాడికి సర్వే వాళ్లు కూడా వచ్చి వెళ్లారు. వాళ్లు అన్నీ అడిగారు. ఎవరికి ఓటు వేస్తావో సెప్పమన్నారు. నేను కూడా వెళ్లి ఓటు ఉందో లేదో సూసుకుంటా. 
సుబ్బయ్య : అవున్లే... టయానికి గుర్తు సేసావు ఓటరు కార్డు తీసుకురా.. ఎందుకైనా మంచిది ఇప్పుడే ఎమ్మార్వో ఆఫీసుకెళ్లి సూసుకొస్తా. ఓటు లేనోళ్లు ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలంటా.. లేకుంటే ఓటేయలేమప్ప.

Advertisement
Advertisement