తపాలా శాఖలో ‘కుసుమ’ కలకలం | Conflicts in Chittoor Postal Department | Sakshi
Sakshi News home page

తపాలా శాఖలో ‘కుసుమ’ కలకలం

Jan 21 2019 12:03 PM | Updated on Jan 21 2019 12:03 PM

Conflicts in Chittoor Postal Department - Sakshi

చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయం

చిత్తూరు కార్పొరేషన్‌: తపాలా శాఖ మాజీ ఉద్యోగి కుసుమ ఫిర్యాదు చిత్తూరు పోస్ట ల్‌ శాఖలో కలకలం రేపింది. సాక్షాత్తు ఆ శాఖ ఎస్పీ(సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ ఆఫీస్‌) విజయ్‌కుమార్‌తో సహా ఏడుగురిపై క్రిమినల్‌ కేసు నమోదవడంతో తపాలా శాఖకు అవినీతి మరకలు అంటుకున్నాయి.

ఏం జరిగిందంటే..
ఐరాల సబ్‌ పోస్టాఫీసు పరిధిలోని ముదిగోళం బ్రాంచ్‌లో దళిత కులానికి చెందిన కుసుమ రెగ్యులర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. గతేడాది పోస్టల్‌ శాఖలో ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో ముదిగోళంలో ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని పాసుబుక్‌ సీల్‌ వేసి, అకౌంట్‌ బుక్‌లో నమోదు చేసేవారు. అలా నమోదు చేయరాదని పూతలపట్టు సబ్‌ పోస్టాఫీçసర్‌ కవిత ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కుసుమ విధులు నిర్వహించారు. వీటిని ఆన్‌లైన్‌ చేయడంలో కవిత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో యూసీఆర్‌ (అన్‌ క్లారిఫైరిసిప్ట్‌)లో రూ.15,832 ఎక్కువగా రావడంతో కుసుమపై నెపం నెట్టేసి, ఆమెను వి«ధుల నుంచి తొలగించారు. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదవడంతో అరెస్టు కూడా అయ్యారు. తన తప్పు లేకుండా విధుల నుంచి తొలగించారని, మొత్తంవ్యవహారంపై పూర్తి విచారణ చేయాలని, ఈ వ్యవహారంలో పెద్దల పాత్ర ఉందని, ఖాతా దారుల నగదు గోల్‌మాల్‌లో చాలామంది ప్రమేయం ఉందని కుసుమ పోలీసులను ఆశ్రయించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయం చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చిత్తూరు నాలుగో మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం కుసుమ ఆరోపణలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కేసు నమోదు వీరిపైనే..
కుసుమ ఫిర్యాదుతో విజయ్‌కుమార్‌(తపాలా శాఖ ఎస్పీ చిత్తూరు), మల్లికార్జున (వాయల్పాడు పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌), ఆర్ముగం(తపాలా శాఖ ఎఎస్పీ చిత్తూరు), కవిత (వెంగలరాజకుప్పం ఎస్‌వో), జశ్వంత్‌(విచారణ అధికారి, ఎస్పీ కార్యాలయం), మురళీకుమార్‌ (పోస్ట్‌మ్యాన్‌ చిత్తూరు), బీవీఆర్‌ మూర్తి(ప్రధాన తపాలా కార్యాలయ పోస్ట్‌మాస్టర్‌)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ 120–ఎ, 120–బీ, 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 177, 194, ,195, 196, 199, 211, 212, 218, 454, 488 సెక్షన్ల కింద కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు.

అధికారులు మౌనం..
ఈ వ్యవహారంపై తపాలా శాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు. కుసుమ చేసిన ఆరోపణలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. పెదవి విప్పితే తపాలా శాఖ పరువు బజారున పడుతుందని అధికారులు దీనిపై మాట్లాడటం లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement