ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు | Collector Serious on uncleaned freshwater tanks | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు

Dec 13 2013 2:09 AM | Updated on Mar 21 2019 8:19 PM

మంచినీటి ట్యాంకులను శుభ్రపర్చడం లేదు.. కోరినేషన్‌ను పట్టించుకోవడం లేదు.. శానిటేషన్‌పై దృష్టి సారించడం లేదు..

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మంచినీటి ట్యాంకులను శుభ్రపర్చడం లేదు.. కోరినేషన్‌ను పట్టించుకోవడం లేదు.. శానిటేషన్‌పై దృష్టి సారించడం లేదు.. ఈవిధంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఈవోఆర్‌డీలను హెచ్చరించారు. మంచినీటి ట్యాంకుల దుస్థితి.. అధికారుల అలసత్వంపై ‘సమరసాక్షి’ శీర్షికన ఈనెల 9న నియోజకవర్గాల వారీగా ప్రచురించిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. గురువారం ఈవోఆర్‌డీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా మంచినీటి ట్యాంకుల తాజా స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ట్యాంకులు క్లీన్ చేశామని చెబితే సరిపోదని.. తేదీలతో కూడిన ఫొటోలు చూపాలని ఆదేశించారు. ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్‌పై ఇక నుంచి డీఎల్‌పీఓలు, ఈఓఆర్‌డీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మేజర్, మైనర్ పంచాయతీలకు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కల్లూరు ఈఓఆర్‌డీ ట్యాంకు క్లీనింగ్‌కు సంబంధించి ఒక్క ఫొటో కూడా చూపకపోవడంతో కలెక్టర్ ఆగ్రహించారు. ప్రతి శుక్రవారం విధిగా ట్యాంకులన్నింటినీ శుభ్రం చేసి ఆరబెట్టాలన్నారు. నీటిని క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. 13 ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పని ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత ఫొటోలు తీయాలన్నారు. జిల్లా పరిషత్ నిధులను సీసీ రోడ్లకు వెచ్చించాలని సూచించారు. మంచినీటి బోర్ల చుట్టూ ప్లాట్‌ఫాం నిర్మించి నీరు కాల్వలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులను జనవరి చివరికల్లా పూర్తి చేసి యూసీలు అందజేయాలన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు తగిన స్థలం లేకపోతే తహశీల్దార్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, డీపీఓ శోభ స్వరూపరాణి, కర్నూలు, నంద్యాల, ఆదోని డీఎల్‌పీఓలు, అన్ని మండలాల ఈఓఆర్‌డీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement