ఒక్క చోట గందరగోళం.. వీఆర్వో పరీక్ష ప్రశాంతం | Chaos in one place .. Also, the test records | Sakshi
Sakshi News home page

ఒక్క చోట గందరగోళం.. వీఆర్వో పరీక్ష ప్రశాంతం

Feb 3 2014 2:06 AM | Updated on Sep 2 2017 3:17 AM

ఒక్కచోట మినహాయిస్తే నగరంలో వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా, సాఫీగా ముగిసింది. ఏపీపీఎస్‌సీ నిర్వాకం కారణంగా నగరంలోని అక్కయ్యపాలెంలోగల జ్ఞాన నికేతన్

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒక్కచోట మినహాయిస్తే నగరంలో వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా, సాఫీగా ముగిసింది. ఏపీపీఎస్‌సీ నిర్వాకం కారణంగా నగరంలోని అక్కయ్యపాలెంలోగల జ్ఞాన నికేతన్ స్కూల్లో వీఆర్వో పరీక్ష ప్రారంభంలో గందరగోళం చోటు చేసుకుంది. అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అధికారులను పరుగులు పెట్టించింది. అభ్యర్థుల సంఖ్య కన్నా తక్కువగా ప్రశ్నపత్రాలను పంపించడంతో ఈ కేంద్రంలో పరీక్ష ఆలస్యమైంది.

అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారులు హైరానా పడి ఇతర కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకువచ్చి పరీక్ష నిర్వహించారు. ఈ సంఘటన మినహా మిగిలిన కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 41 వీఆర్వో, 12 వీఆర్‌ఏ పోస్టులకు ఆదివారం 39  కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

వీఆర్వో పరీక్షకు మొత్తం 21,284 మంది దరఖాస్తు చేసుకోగా 19,160 మంది (90.1 శాతం) పరీక్షకు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన వీఆర్‌ఏ పరీక్షకు 888 మంది అభ్యర్థులలో 738 మంది (83.1 శాతం) పరీక్ష రాశారు. కలెక్టర్ ఆరోఖ్య రాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి నిర్వహణను పరిశీలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement