బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా
జడ్డంగి(రాజవొమ్మంగి) : బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు దీనిని సహించరని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ రాజవొమ్మంగి మండల కన్వినర్ సింగిరెడ్డి రామకృష్ణ ఇంట జడ్డంగిలో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన నెహ్రూ తిరిగి వెళుతూ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం సరికాదన్నారు.
పిల్లలను కనాలని చెబుతున్న సీఎం మనకు లభిస్తున్న ఆహారశాతం ఎంత, పెరుగుతున్న జనాభా ఎంతనేది బేరీజు వేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ జననాలరేటు పెరిగితే అది తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు చెప్పుకోవాలని చూస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. మన దేశంలో, రాష్ట్రంలో యువరక్తానికి లోటులేదని వారికి తగిన అవకాశాలు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలకు పౌష్టికాహారం అందజేసేందుకు కృషి చేయాలని ఆయన సీఎంకు సూచించారు. ప్రస్తుత మానవవనరులను మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఎక్కడో జపాన్లోని పరిస్థితులను మనకు అన్వయించాలని చూసేముందు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆకళింపుచేసుకోవాలి కదా అని పేర్కొన్నారు. రుణమాఫీ ఒక అంకెల గారడీ అని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ బలోపేతం
వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో, జిల్లాలో రోజురోజుకు బలోపేతమవుతుందని నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. మరో మూడు నెలలో పార్టీ సభ్యత్వాల నమోదులో అద్భుత ఫలితాలను చూడవచ్చన్నారు. ఆయనతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ చప్పా నూకరాజు, సర్పంచ్ కొంగర మురళీకృష్ణ తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ప్రత్తిపాడు ఎంఎల్ఏ. పరుపుల సుబ్బారావు కూడా హాజరయ్యారు.