వ్యాపారం స్వీటు.. సమస్యలు ఘాటు | Business Career .. Perception problems | Sakshi
Sakshi News home page

వ్యాపారం స్వీటు.. సమస్యలు ఘాటు

Dec 9 2013 2:02 AM | Updated on Oct 9 2018 2:17 PM

సాలీనా రూ.150 కోట్ల టర్నోవర్ కలిగిన జాతీయ స్థాయి బెల్లం మార్కెట్ అది. రోజు వారీ ఆర్థిక లావాదేవీలతో రెగ్యులేటరీ వ్యవసాయ...

=అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను వేధిస్తున్న ఇబ్బందులు
 =ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలు

 
అనకాపల్లి, న్యూస్‌లైన్: సాలీనా రూ.150 కోట్ల టర్నోవర్ కలిగిన జాతీయ స్థాయి బెల్లం మార్కెట్ అది. రోజు వారీ ఆర్థిక లావాదేవీలతో రెగ్యులేటరీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా అదే. లావాదేవీల నేపథ్యంలో సెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నా ఆ మార్కెట్ యార్డుపై నిధులు ఖర్చు పెట్టేందుకు ప్రతిసారి ఏదో ఒక కొర్రియే. ఈ మార్కెట్లో నిత్యం పెద్దసంఖ్యలో రైతులు, వర్తకులు, కార్మికులు లావాదేవీల్లో పాల్గొంటారు. నల్లబెల్లం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో మూడు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఇక్కడే ఉంది.

ఇలా అనేక ప్రాధాన్యతలు సంతరించుకున్న అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ సమస్యలతో సతమతమవుతోంది. అర్ధరాత్రి వరకు పనిచేసే ఇక్కడి కార్మికులకు క్యాంటీన్ సదుపాయం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల విశ్రాంతి కోసం నిర్మించిన రైతు భవనం మొక్కుబడిగానే కొనసాగుతుంది. విశ్రాంతి భవనాలను ఈ విభాగంతో సంబంధం లేని సిబ్బందికి తాత్కాలికంగా కేటాయించడంతో బెల్లం లావాదేవీల కోసం వచ్చే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కుళాయి దిమ్మల వద్ద అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఈ మార్కెట్‌యార్డులోకి ప్రైవేటు వ్యక్తుల సంచారం పెచ్చుమీరినా అరికట్టలేకపోతున్నారు.

మార్కెట్‌యార్డుకు ఆనుకొని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ బయట వ్యక్తుల హవా కోనసాగుతోంది. రోజూ చెత్త తొలగింపు అరకొరగానే ఉంటోంది. మార్కెట్‌యార్డులో చేపలు కొనుగోలు కేంద్రాలు, రైతు బజార్  ఏర్పాటు చేయాలని భావించినా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మార్కెట్ కమిటీ ఎప్పటికప్పుడు అద్దె వసూలు చేయాల్సి ఉన్నా తాత్సారం జరుగుతోంది. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇలా ఎన్నో సమస్యలతో అనకాపల్లి మార్కెట్‌యార్డు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement