జిల్లాలో బ్లాక్ డే.. నిరసన ర్యాలీలు | Black Day Rally in adilabad district | Sakshi
Sakshi News home page

జిల్లాలో బ్లాక్ డే.. నిరసన ర్యాలీలు

Dec 7 2013 4:26 AM | Updated on Sep 2 2017 1:20 AM

బాబ్రీమసీద్ కూల్చివేత దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో ముస్లింలు, వివిధ సంఘాల నాయకులు బ్లాక్ డేగా పాటించారు.

ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : బాబ్రీమసీద్ కూల్చివేత దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో ముస్లింలు, వివిధ సంఘాల నాయకులు బ్లాక్ డేగా పాటించారు. లౌకికవాద దేశంలో ఇలాంటి సంఘటన జరగడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంబీటీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వీధుల గుండా మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో ఎస్‌ఎస్ రాజుకు వినతిపత్రం అందజేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేసిన స్థలంలోనే పునర్నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
 
 ఎంబీటీ జిల్లా అధ్యక్షుడు ఆయాజ్ అహ్మద్ షమా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్వర్, పట్టణ అధ్యక్షుడు అక్తర్‌ఖాన్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్‌లో మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్‌లో ముస్లింలు ధర్నా నిర్వహించి సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. భైంసాలో ముస్లింలు దుకాణాలు బంద్ చేసి బ్లాక్ డే పాటించారు. మంచిర్యాలలో రైల్వేస్టేసన్ నుంచి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
 
  సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్‌లో ఎంఐఎం నాయకులు అభిందిన్ మాఫియా, అజర్, నాయకులు, జమాతే ఉల్మ్ హింద్ సయ్యద్ అజార్, వసీం, అహ్మద్ ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్‌లో ఎన్టీర్ చౌక్ నుంచి ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహశీల్దార్ కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6ను మతతత్వ దినంగా పరిగణించాలని దిష్టిబొమ్మ దహనం చేశారు.
 
 బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి
 ఆసిఫాబాద్ : బాబ్రీ మసీద్ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట శెరియత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు ఎంఏ వాహబ్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శేక్ ఇబ్రహీం, సయ్యద్‌జాఫర్, ఎండి.ఇస్మాయిల్, షబ్బీర్, ఎండివజీర్, ఎస్కే చాంద్, సయ్యద్ జావిద్, సయ్యద్ అన్సార్, ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement